ప్రశాంతమైన, పవిత్రమైన తిరుపతిలో భూ మాఫియా రెచ్చిపోతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ అన్నారు.
తాజాగా 2వ తేదీ రేణుగుంట రోడ్డులో గల బాలాజీ టింబర్ డిపో యజమానులపై దౌర్జన్యం చేసి స్థలం ఖాళీ చేయాలని బెదిరించిన వారిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసు అధికారులు రాజీ చేసుకోమని చెప్పడం దేనికి తార్కాణం అని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తిరుపతిలో భూయజమానులకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. సెటిల్మెంట్ల పేరుతో భూదందాలు చేస్తున్న ముఠాలను అరికట్టాలని ఆయన కోరారు.
ప్రశాంత తిరుపతి నగరంలో, అలిపిరి, తిరుచానూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో, తిరుపతి రూరల్ మండలం లో గల విలువైన భూములను, ఇళ్ల స్థలాలను, అపార్ట్మెంట్లోని ఫ్లాట్ లను సివిల్ వివాదాల పేరుతో అధికార పార్టీ పేరు చెప్పి మారణాయుధాలు చేతబూని దౌర్జన్యాలకు తెగబడుతూ దిక్కున్న చోట చెప్పుకో మంటున్నారని ఆయన అన్నారు.
తన పేరు చెప్పి దందాలు చేస్తే సహించనని చెప్పిన తిరుపతి ఎమ్మెల్యే, మరి అధికార పార్టీ పేరు చెప్పి దౌర్జన్యాలు చెసే వారిని నిలువరించి బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు.
బాధితులు ఫిర్యాదు చేస్తున్న గంగిరెడ్డి కి వైసీపీ కి సంబంధం లేదా? అని ఆయన ప్రశ్నించారు.