తిరుమల తిరుపతి దేవస్థానం మంచి పద్ధతులు అవలంబించి అన్ని దేవస్థానాల బోర్డులకు ఆదర్శంగా ఉండాలని, అలాంటి టీటీడీనే భూములు అమ్మేసుకుంటే మిగిలిన దేవస్థానం బోర్డులు కూడా అదే పని చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
దేశంలోని అన్ని హిందూ దేవాలయాలు, సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తాయని, ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యధిక ఆదాయం వచ్చే దేవాలయాల్లో ఒకటిగా ఉన్న టీటీడీ మంచి పద్ధతులను అనుసరించి ఇతరులను స్ఫూర్తిగా నిలవాల్సి ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు.
టీటీడీ భూములను అమ్మాలన్న నిర్ణయం పట్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయని ఆయన అన్నారు. విభజనతో నష్టపోయి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఇప్పటికీ పూర్తి స్థాయి రాజధాని నగరం లేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఏపీకి పెట్టుబడులు కావాలని, ఉద్యోగాలను సృష్టించాలని, ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవాలని ఆయన అన్నారు. ఇటువంటి సమయంలో భూములు రెవెన్యూ కోసం ఉపయోగపడతాయని, ప్రభుత్వ భూములను, ఆస్తులను సర్కారు తప్పనిసరిగా కాపాడుకోవాలని ఆయన అన్నారు. ఇందుకోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలని చెప్పారు. భక్తుల నమ్మకాలు, మనోభావాలు దెబ్బతీయడం, రాష్ట్రంలో భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితులను బాగుచేసే అంశాలను కూడా ప్రమాదంలోకి నెడితే ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన ఘోరమైన తప్పుగా నిలిచిపోతుందని ఆయన అన్నారు