ఒడిశాలో ముగ్గురు రష్యా పౌరులు ఒక్కొక్కరుగా మరణించిన విషయం మరింత కలకలానికి కారణం అవుతున్నది. పుతిన్ వ్యతిరేక రష్యా ఎంపీ మరియు అతని స్నేహితుడి మరణంపై ఒడిశా సిఐడి దర్యాప్తు చేస్తుండగా, మంగళవారం పారాదీప్ పోర్ట్లో లంగరు వేసిన ఓడలో రష్యా ఇంజనీర్ మరణించడం ఆందోళన కలిగిస్తున్నది. మూడు మరణాల మధ్య ప్రత్యక్ష సంబంధం లేదు, కానీ ఈ రహస్య మరణాలు ఒడిశా పోలీసులను సవాల్ చేస్తున్నాయి.
డిసెంబర్ 22 న, రష్యా పర్యాటకుడు వ్లాదిమిర్ బిడెనోవ్ (61) రాయ్గఢ్ నగరంలోని ఒక హోటల్లో అనుమానాస్పద స్థితిలో తన గదిలో శవమై కనిపించాడు. అయితే పోస్టుమార్టంలో ఆయన మృతికి గుండెపోటు కారణమని తేలింది. బిడెనోవ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు సన్నిహితుడైన చట్టసభ సభ్యుడు పావెల్ ఆంటోనోవ్ (65) స్నేహితుడు. బిడెనోవ్ మరణించిన రెండు రోజుల తర్వాత, రష్యాకు చెందిన సంపన్న వ్యాపారవేత్త మరియు ఎంపీ అయిన పావెల్ డిసెంబర్ 24న అదే హోటల్లోని మూడో అంతస్తు నుంచి కిందపడి మరణించారు. ఈ రెండు కేసులను ఒడిశా సీఐడీ విచారిస్తోంది.
ఈ రెండింటికి సంబంధించి రాయ్గఢ్లోని సదర్ పోలీస్ స్టేషన్లో రెండు వేర్వేరు అసహజ మరణం కేసులు నమోదయ్యాయి. సిఐడి రాయ్ఘర్ సమీపంలోని శ్మశానవాటిక నుండి ఆంటోనోవ్, బిడెనోవ్ల శరీర అవశేషాలను కూడా సేకరించారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. ప్రాథమిక పోస్ట్మార్టం నివేదికలో, ఒడిశా సిఐడి రష్యా ఎంపీ పావెల్ కిందపడటం వల్ల అంతర్గత గాయాలతో మరణించారని, బిడెనోవ్ గుండెపోటుతో మరణించాడని తేలింది.
మృతులిద్దరికీ వారి కుటుంబ సభ్యులు, రష్యా రాయబార కార్యాలయం సమ్మతితో ఒడిశాలో అంత్యక్రియలు జరిగాయి. రష్యా ఎంపీ మరియు అతని స్నేహితుడి మరణంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. మంగళవారం బంగ్లాదేశ్ నుండి ముంబైకి వెళ్తున్న ఓడ చీఫ్ ఇంజనీర్, రష్యా పౌరుడు మిల్యకోవ్ సెర్గీ మరణించారు. ఓడలోని తన క్యాబిన్లో శవమై కనిపించాడు.
మృతికి గల కారణాలు వెంటనే తెలియరాలేదని పారాదీప్ పోలీసులు తెలిపారు. రష్యా ఇంజనీర్ మృతిపై సమగ్ర విచారణ జరుపుతామని పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ పీఎల్ హరానంద్ తెలిపారు. రష్యా పౌరులు తరచూ మరణిస్తుండడంపై ఒడిశా పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒడిశాలోని హోటల్ అసోసియేషన్ కూడా ఈ మరణాలపై క్షుణ్ణంగా విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని అభ్యర్థించింది. మరణాలపై విచారణ జరిపి హోటల్ పరిశ్రమను ప్రతికూల ప్రభావాల నుంచి కాపాడాలని సీఎం నవీన్ పట్నాయక్కు లేఖ రాశారు. రష్యా పౌరుల మరణాలు పర్యాటక రంగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయగలవని ఆయన అన్నారు.
మరణంలో నేర కోణం లేదు: రష్యా
ఇదిలావుండగా, ఒడిశాలోని రాయ్గఢ్ జిల్లాలోని ఓ హోటల్లో కొద్దిరోజుల వ్యవధిలోనే ఇద్దరు రష్యన్ పౌరులు మృతి చెందడంపై రాష్ట్ర పోలీసుల విచారణలో ఎలాంటి నేర కోణం బయటపడలేదని ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం పేర్కొంది. పోలీసుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఈ మరణాల్లో ఎలాంటి నేర కోణం లేదు. సోమవారం, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) రాయ్గఢ్ ఎస్పీకి నోటీసు జారీ చేసింది. ఒడిశాలో రష్యా పౌరుల మరణానికి సంబంధించి నాలుగు వారాల్లో నివేదిక (ATR) కోరింది. బెహ్రాంపూర్ నగరానికి చెందిన మానవ హక్కుల కార్యకర్త రవీంద్ర కుమార్ మిశ్రా దాఖలు చేసిన పిటిషన్పై ఎన్హెచ్ఆర్సి ఈ ఉత్తర్వులు జారీ చేసింది.