దేశమంతా కరోనా భయంతో విలవిల్లాడుతున్న తరుణంలో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ షాక్ ఇచ్చారని కాంగ్రెస్ నేత రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బిజెపి ప్రభుత్వం గతంలో ప్రకటించిన కరువు భత్యం (డీఏ)ను రద్దు చేయడం దుర్మార్గమని ఈ మేరకు ప్రధాని ఇచ్చిన ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని నవీన్ డిమాండ్ చేశారు. ఈ ఉత్తర్వులు గురువారం మధ్యాహ్నం వెలువడ్డాయి.
దీంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పోస్టల్,టెలికాం, రైల్వేస్ లాంటి అనేక సంస్థలలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెన్షనర్లకు గతంలో పెంచిన డీఏను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పై పెదవి విరుస్తూ జులై 2021 వరకు పెంచిన డీఏ పెంపు నిలుపుదలపై మండిపడుతున్నారు.
2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు డీఏ బకాయిల చెల్లింపు కూడా ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొనడం చాలా అన్యాయం అన్నారు. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న డీఏ మాత్రమే కొనసాగుతుందని ఈ నిర్ణయం ప్రభావం దేశవ్యాప్తంగా వున్న కోటీ 30 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం అరచేతిలో వైకుంఠ చూపించిందని పెన్షన్ అనేది పదవీ విరమణ చేసిన ప్రతి ఒక్క ఉద్యోగికి ఎంతో భరోసా అని నవీన్ అన్నారు.
2015 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పదవీ విరమణ చేసిన వారికి 100% పెన్షన్ ఇవ్వాలని కోత విధించే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకొని గతంలో ప్రకటించిన విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు డీఏ ఇవ్వాలని నవీన్ డిమాండ్ చేశారు.