అబుదాబి నుండి ముంబైకి వస్తున్న విస్తారా ఎయిర్లైన్ ఫ్లైట్ (యుకె-256)లో ఇటలీకి చెందిన ఒక మహిళ తన బట్టలు విప్పి విమానంలో తిరగడంతో కలకలం సృష్టించింది. విమాన సిబ్బంది ఆమెను అడ్డుకోవడంతో మహిళ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు గొడవకు దిగింది. విమానం ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే సిబ్బంది ఫిర్యాదు మేరకు మహిళను అరెస్ట్ చేశారు. ఇటలీలో నివసిస్తున్న మహిళను పావోలా పెరుచియోగా గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. విమానంలో ఆమె మద్యం మత్తులో ఉంది. విచారణ పూర్తి చేసి నిందితురాలిగా ఉన్న మహిళపై చార్జిషీటు దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు రూ. 25,000 జరిమానా కూడా విధించారు.
ఆ తర్వాత మహిళకు బెయిల్ మంజూరు చేశారు. ఇటలీకి చెందిన మహిళ ఎకానమీ క్లాస్ టిక్కెట్ని కలిగి ఉండగా, విమానంలో వెళ్లేటప్పుడు బిజినెస్ క్లాస్కు వెళ్లి కూర్చున్నట్లు పోలీసులు తెలిపారు. సిబ్బంది ఆమెను తన సీటుకు వెళ్లమని అడగడంతో, మహిళ దుర్భాషలాడడం ప్రారంభించింది. ఆమె సిబ్బందిని కొట్టింది. ఆ తర్వాత ఆ మహిళ తన బట్టలు విప్పి అక్కడక్కడ తిరగడం ప్రారంభించింది. మహిళ ప్రవర్తన విమానంలో కలకలం సృష్టించింది.
దీని తరువాత, కెప్టెన్ సూచనల మేరకు, సిబ్బంది మహిళను పట్టుకుని, ఆమెకు దుస్తులు వేశారు. విమానం దిగగానే మహిళను సీటుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు విస్తారా ఎయిర్లైన్స్ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే చర్యలు తీసుకోవాలని భద్రతా సంస్థలకు సమాచారం అందించారు.
ఎస్ఓపీ ప్రకారం ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించామని తెలిపారు. విస్తారా తన ప్రయాణీకులు మరియు ఉద్యోగుల భద్రతకు సంబంధించి జీరో టాలరెన్స్ పాలసీకి దృఢంగా కట్టుబడి ఉంది.