తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి కోర్టు ఆర్డర్ తో ఏపికి వచ్చిన సోమేష్ కుమార్ కు ప్రాముఖ్యత కలిగిన పోస్టింగ్ ఇస్తారా? ప్రాముఖ్యత సరే… సాధారణమైన పోస్టింగ్ అయినా ఇస్తారా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. సోమేష్ కుమార్ కు ప్రాధాన్యతకలిగిన పోస్టింగ్ ఇవ్వడంపై ఏపి క్యాడర్ ఐఏఎస్ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సోమేష్ కుమార్ తన పదవీ కాలంలో ఏపికి తీరని అన్యాయం చేశారని కొందరు ఐఏఎస్ అధికారులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. విభజన హామీలు అమలు చేయడంలో సోమేష్ కుమార్ తీవ్రంగా ప్రతిఘటించడం వల్ల ఏపికి తీరని అన్యాయం జరిగిందనే భావన ఏపి అధికారులలో ఉన్నది. అదే విధంగా నిధుల బదిలీకి సంబంధించిన వ్యవహారాలలోనూ, నీటిపారుదల విషయంలోనూ కూడా సోమేష్ కుమార్ తెలంగాణ సీఎస్ గా చేసిన వాదనలతో ఏపి ఎంతో నష్టపోయింది. ఇంత నష్టం చేసిన అధికారికి మళ్లీ ఏపిలో కీలక పదవి ఇవ్వడం వల్ల ఏపి లోని ఐఏఎస్ అధికారులు మొత్తం తీవ్రమైన నిరాశలో కూరుకుపోతారని అంటున్నారు.
సోమేష్ కుమార్ మంచి అధికారి అని, ఆయనకు ఉన్నతమైన పదవి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సు చేసినట్లుగా కూడా చెబుతున్నారు. ఎంతో మంచి మిత్రుడు, సన్నిహితుడు, తనకు పెద్దన్నలాంటి వాడు అయిన కేసీఆర్ మాట మన్నించాలా? లేక రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్ అధికారుల వాదనవైపు మొగ్గు చూపాలా అనే విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారని తెలిసింది. ఒక వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ మాట విని సోమేష్ కుమార్ కు ఉన్నత పదవి కట్టబెడితే ఇంత కాలం తనతో కలిసి పని చేసిన ఐఏఎస్ అధికారులు తీవ్రంగా నొచ్చుకుని తనకు సహాయ నిరాకరణ ప్రారంభించే అవకాశం ఉందని జగన్ భయపడుతున్నారని తెలిసింది.
ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పని చేసిన వ్యక్తి మరో రాష్ట్రానికి వచ్చి అంతకు కింది స్థాయిలో పని చేయడం ఆయనకే సిగ్గుచేటని మరొక వాదన వినిపిస్తున్నది. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులందరికి బాస్ గా వ్యవహరించిన వ్యక్తి మరొక రాష్ట్రంలోకి వచ్చి చీఫ్ సెక్రటరీ ఆదేశాలను అమలు చేయాల్సిన పరిస్థితిలో వీఆర్ఎస్ తీసుకోవడం మర్యాదగా ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సీనియారిటీ వ్యవహారం తో బాటు ఏపి అధికారుల పూర్తి వ్యతిరేకత కూడా ఉన్నందున సోమేష్ కుమార్ ను ఏం చేస్తారనే అంశం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉండిపోయింది.