లారీ చోరికి గురైందని వచ్చిన ఫిర్యాదు కేవలం మూడు గంటల్లోనే ఛేదించినట్లు జనగామ పట్టణ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. ఈ ఘటనపై సీఐ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఎల్లయ్యకు చెందిన టిఎస్ 05 యూబి 5258 ఇసుక లారీని పెంబర్తి వద్ద తన వద్ద ఉన్న క్లినర్ దొంగతనం చేశాడని ఎల్లయ్య ఆదివారం జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు అందుకున్న సీఐ మల్లేష్ యాదవ్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అకస్మీక తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు లారీ దొంగతనానికి పాల్పడిన నిందితుడు శివ పోలీసులకు భయపడి రఘునాథపల్లి టోల్ ప్లాజా వద్ద లారీ వదిలి వెళ్లాడు.
పోలీసులు లారీని ఎల్లయ్యకు అప్పగించి చోరీకి పాల్పడిన నిందితుని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. ఫిర్యాదు వచ్చిన మూడు గంటల్లో స్పందించిన జనగామ పోలీస్ బృందాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ అభినందించారు.