అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ తో సహా మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం శనివారం నాడు షెడ్యూల్ను ప్రకటించింది.
ఉత్తర్ ప్రదేశ్ లో 403 అసెంబ్లీ స్థానాలు, పంజాబ్ లో 117, గోవా లో 40, మణిపూర్ లో 60, ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. కరోనా ఉధృతి నేపథ్యంలోనే ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ రాష్ట్రాల్లో 100 శాతం రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు.
మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సుశీల్ చంద్ర తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ సభ్యులు పర్యటించారని ఆయన వెల్లడించారు. ఐదు రాష్ట్రాల్లో 2 లక్షల 15వేల 368 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం ఐదు రాష్ట్రాల్లో 900 మంది ఎలక్షన్ అబ్జర్వర్లను నియమించినట్లుగా వివరించారు.
గత 6 నెలలుగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపామని తెలిపారు. డీజీపీలు, చీఫ్ సెక్రటరీలు, జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించామని, కోవిడ్-19 పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ, హోంశాఖ అభిప్రాయాలు కూడా తీసుకున్నామన్నారు.
ప్రతి పోలింగ్ స్టేషన్లో గతంలో గరిష్టంగా 1,500 ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్యను 1,250కు కుదించినట్లు వివరించారు. ఓటర్ల సంఖ్యను తగ్గించడంతో పోలింగ్ స్టేషన్ల సంఖ్య పెరిగినట్లు అయన వివరించారు. వైకల్యంతో బాధపడేవారి కోసం వీల్ చైర్ సహా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలతో పాటు ఎందుకు అభ్యర్థిగా ఎన్నుకున్నారో కారణాలను పార్టీలు తమ వెబ్సైట్లలో పొందుపర్చాలని ఈ సందర్బంగా రాజకీయ పార్టీలకు సుశీల్ చంద్ర సూచించారు.
అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ఖర్చును రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచినట్లు వివరించారు. ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 14న యూపీలో తొలిదశ నోటిఫికేషన్, ఉత్తరప్రదేశ్లో ఫిబ్రవరి 10 నుండి మార్చి 7 వరకు 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 తేదీన మొదటి విడత ఎన్నికలు, రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి 14, మణిపూర్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఫిబ్రవరి 27న జరగనుండగా.. రెండవ దశ మార్చి 3వ తేదీన జరగనుంది.