కేసు దర్యాప్తు సక్రమంగా నిర్వహించని పోలీసులకు హైకోర్టు అక్షింతలు వేసింది. కేసు దర్యాప్తు సక్రమంగా నిర్వహించకపోవడమే కాకుండా నిందితులకు అనుకూలంగా వ్యవహరించారు జార్ఖండ్ పోలీసులు.
గిరిధ్ జిల్లా కేంద్రంలో ఒక వివాహిత, ముగ్గురు పిల్లలు సజీవ దహనం అయ్యారు. నలుగురూ కాలిపోయి మరణించిన తర్వాత ఆమె తండ్రికి సమాచారం అందింది.
దాంతో ఆయన పోలీసులకు తన అల్లుడిపై ఫిర్యాదు చేశారు. వివాహం అయిన ఆరు సంవత్సరాల నుంచి అతను వేధిస్తూనే ఉన్నాడని, ఇప్పుడు అతనే నలుగుర్ని హత్య చేసి ఉంటాడని వివాహిత తండ్రి ఆరోపించాడు.
సంబంధిత పోలీసులు మాత్రం ఈ ఫిర్యాదును తేలిగ్గా తీసుకుని కేసు దర్యాప్తు ఏమాత్రం చేయకపోగా వివాహిత తండ్రినే హేళన చేయడంతో అతను జార్ఖండ్ హైకోర్టు కు ఫిర్యాదు చేశాడు.
కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం పోలీసులు ఈ కేసు విచారణలో ఏ మాత్రం శ్రద్ధ చూపలేదని అభిప్రాయపడింది.
తక్షణమే సంబంధిత పోలీసు అధికారులపై చర్య తీసుకోవాలని జార్ఖండ్ హైకోర్టు జార్ఖండ్ డిజిపికి ఆదేశాలు జారీ చేసింది.