దుక్కి దున్నడం మొదలు విత్తు నాటడం,కోతకోయడం కుప్పలేత్తడం వరకు మహిళ రైతుల చెమట చుక్కలే (పంటకు) చేనుకు జీవనాధారం అని ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు.
గురువారం మహిళ రైతు దినోత్సవం సందర్భంగా మధ్యాహ్న సమయంలో జాకారం సమీపంలోని వరి పొలంలో కలుపు తీస్తున్న మహిళలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
తస్లీమా మహిళ రైతులతో కలిసి కాసేపు వరి కలుపు తీశారు. అనంతరం తస్లీమా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు చాలా మంది వ్యవసాయ రంగంలో రాణిస్తున్నారని అన్నారు.
దేశ ఆహార భద్రతలో మహిళ రైతులు, మహిళ కూలీలు ప్రధాన భూమిక వహిస్తున్నారని ఆమె అన్నారు. మహిళ రైతులు లేకుంటే నాటు వేయడం, కలుపు తీయడం కష్టంగా మారుతుందని అన్నారు.
మహిళలు రోజంతా కూరుపోయే బురదలో సహనంతో కష్టపడి పని చేస్తూ మనకు ఆహారాన్ని అందిస్తున్న అన్నపూర్ణ దేవిలు మన మహిళ రైతులు అని తస్లీమా కొనియాడారు.