జోర్డాన్ పార్లమెంట్లో ఎంపీలు.. ఒక్కసారిగా బాహాబాహికి దిగారు. విచక్షణ కోల్పోయి గల్లాలు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ సంఘటన పెనుదుమారం రేపింది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఎంపీలే ఇలా పిడిగుద్దుల వర్షం కురిపించుకుంటే ఎలా అంటూ పలువురు విమర్శిస్తున్నారు.
ఇటీవల జోర్డాన్ పార్లమెంటులో రాజ్యాంగ సంస్కరణల గురించి చర్చ సందర్భంగా ఈ ఘటన జరిగింది. దేశ రాజ్యాంగ సవరణలకు సంబంధించిన అంశాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంపీలు ఒకరినొకరు కొట్టుకుంటూ, దూషించుకుంటూ కనిపించారు.
జోర్డానియన్ల విధులు, హక్కులపై రాజ్యాంగ సవరణ కోరుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగింది. ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీ ఈ సవరణను తప్పుపట్టారు. ఈ బిల్లు పనికిరాదంటూ అధికార పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార పార్టీ ఎంపీల ప్రతి విమర్శలకు దిగారు. సదరు ఎంపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో రెండు వర్గాల ఎంపీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.