ఎందరో అమర వీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణా ఈ రోజు మళ్లీ దొరల చేతి లో కుటుంబ పాలనగా మారిందని ఆదిలాబాద్ పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు గుల్లపెళ్ళి ఆనంద్ అన్నారు. ఈరోజు కాగజ్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు.
అనంతరం టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి మీర్ సాధిక్ అలీ టిడిపి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జి. ఆనంద్ మాట్లాడుతూ సిఎం కేసీఆర్ గారడి మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఆనాడు నీళ్ళు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ఆ మాటే మరచిపోయారని అన్నారు.
కేజీ టు పీజీ ఉచితం విద్య అని చెప్పి గాలికి వదిలేశారని అలాగే ఎస్ సి ఎస్ టి మైనారిటీలకు 12 % రిజర్వేషన్ అని చెప్పి మోసం చేశారని అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష నాయకులను, పాత్రికేయులను జైలుకు పంపించి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
ఆనాడు సకల జనుల సమ్మెలో పాల్గొన్న మేధావులు, విద్యార్థులు, నాయకులు, యువకులు ఈరోజున మనం సాధించుకున్న తెలంగాణా లో ఉన్నామా లేక పక్క రాష్ట్ర పాలనలో ఉన్నామా అని ఆలోచనలో పడ్డారని ఆనంద్ అన్నారు. ఇకనైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ వేదికగా టిడిపి పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి జి.లావణ్య, కార్యనిర్వాహక కార్యదర్శి పరుచూరి సురేష్ కుమార్, మైనార్టీ నాయకులు మోషీన్ బేగ్, కళ్ళూరి శంకర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.