కడప నగరంలో సంచలనం సృష్టించిన హత్య కేసును చిన్న చౌకు పోలీసులు ఛేదించారు. ఓం శాంతి నగర్ రోడ్ నెంబర్ 22 లో ఈ నెల 3 న బాలుడు అయాన్ ఆశ్రిత్ కుమార్ హత్య కేసులో నిందితులైన మేనత్త ఇంద్రజ (25 ), మేనత్త భర్త మాచునూరు అంజన్ కుమార్(31) లను అరెస్టు చేశారు. అదనపు ఎస్.పి(అడ్మిన్) తుషార్ డూడి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
వైఎస్ఆర్ జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు హత్య కేసును చేధించేందుకు చిన్న చౌకు సి.ఐ అశోక్ రెడ్డి తో ప్రత్యేక బృందాలను కడప డి.ఎస్.పి బి.వెంకటశివారెడ్డి ఏర్పాటు చేశారు. తన ప్రేమ వివాహాన్ని గతంలో అంగీకరించని అన్న శివకుమార్ పై ఇంద్రజ కక్ష పెంచుకున్నది. ఉపాధి నిమిత్తం కువైట్ కు శివకుమార్, భాగ్యలక్ష్మి దంపతులు వెళ్లారు. దాంతో నానమ్మ వద్ద శివ కుమార్ కుమారుడు అయాన్ ఆశ్రిత్ కుమార్ ఉన్నాడు.
చదివిస్తామని, బాగా చూసుకుంటామని మాయమాటలు చెప్పి ఆశ్రిత్ ను కడప నగరానికి తీసుకువచ్చింది ఇంద్రజ. బాలుడి తండ్రి శివకుమార్ పై కక్షతో బాలుడిని చంపాలనే ఉద్దేశ్యంతో చిత్రహింసలకు గురిచేసింది ఇంద్రజ. ఆమెకు అంజన్ కుమార్ సహకరించాడు. విషయం తెలిసిన పోలీసులు తమను వెంటాడుతున్నట్లు గుర్తించిన నిందితులు అంజన్ కుమార్, ఇంద్రజ కడప డిప్యూటీ తహసీల్దార్ ఎదుట లొంగిపోయారు.
నాలుగు రోజుల వ్యవధిలోనే కేసును చేధించిన కడప డి.ఎస్.పి బి.వెంకట శివారెడ్డి, ఫ్యాక్షన్ జోన్ డి.ఎస్.పి చెంచుబాబు ఆధ్వర్యంలో చిన్నచౌకు సి.ఐ అశోక్ రెడ్డి, ఎస్.ఐ ఎస్.కె రోషన్, సిబ్బందిని అదనపు ఎస్.పి (అడ్మిన్) తుషార్ డూడి ప్రత్యేకంగా అభినందించారు.