పెళ్లికి మూడు రోజుల ముందు ఇవ్వాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కులు పిల్లలు పుట్టినంక ఇస్తున్నారని తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
శుక్రవారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలోని దేవకి గార్డెన్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం పేదవారి ఇంట్ల సిరి కురిపించే పథకం బానే ఉంది కానీ పెళ్లికి మూడు రోజుల ముందు ఇవ్వాల్సిన కల్యాణలక్ష్మి చెక్కులను పెళ్లి జరిగి పోయి పిల్లలు పుట్టిన తర్వాత చెక్కులు పంపిణీ చేయడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రస్తుత వర్షాకాలంలో భారీగా కురుస్తున్న వానలకు మండలం లో కొన్ని గృహాలు కూలిపోయాయని వీలైనంత అతి తొందరగా లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని ఈ కార్యక్రమానికి హాజరైన కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా కరోనా కష్ట సమయంలో మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యాధికారులు డిప్యూటేషన్ మీద మహబూబ్ నగర్ హైదరాబాద్ ప్రాంతాలలో పనిచేస్తున్నారని వారిని తిరిగి రప్పించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జయపాల్ యాదవ్ ఎంపీపీ నిర్మల, శ్రీశైలం గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.