కర్ణాటక రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బిజెపి పార్టీ ఓటమి మతోన్మాద తిరోగమన విధానాలకు చంప పెట్టు లాంటిదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఎం జిల్లా కమిటీ సమావేశంలో
ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 9 సంవత్సరాల కాలంలో మతోన్మాద విధానాలను అనుసరిస్తూ దేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇతర మతాలపై దాడులు, హత్యలు ,అత్యాచారాలకు పాల్పడుతూ దేశంలో ఐక్యంగా ఉన్న ప్రజల మధ్యలో చిచ్చు పెట్టిందన్నారు.
ప్రజల సంపదను 90% గా ఉన్న దేశ ప్రజలందరికీ అందించాల్సి ఉండగా కేవలం 10 శాతంగా ఉన్న శతకోటీశ్వరులకు అప్పనంగా అక్రమంగా కట్టబెడుతుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని కారు చౌకగా అమ్మి వేస్తూ అంబానీ, ఆదానీలకు కట్టబెడుతుందన్నారు. దేశ ప్రజలపై పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ వంటి చార్జీలు పెంచి మోయలేని భారం మోపిందని విమర్శించారు.
ప్రజలు ఎన్నుకున్న 8 రాష్ట్ర ప్రభుత్వాలను డబ్బుతో కొనుగోలు చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరతపరిచి బిజెపి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్న చరిత్ర బీజేపీది అన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకువచ్చి కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని దారాదత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూసిందని దానికి వ్యతిరేకంగా దేశ రైతాంగం చారిత్రాత్రికంగా నిర్వహించిన పోరాటానికి బిజెపి ప్రభుత్వం తలోగ్గక తప్ప లేదన్నారు.
ఎన్ ఆర్ సి ,సిఏఏ వంటి చట్టాలు తీసుకొచ్చి ముస్లిం ,మైనార్టీలలో చిచ్చు పెట్టిందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి గెలిసేందుకు బిజెపి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని కానీ ఆ రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని భవిష్యత్తులో కూడా జరిగే అన్ని ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓటమి లక్ష్యంగా సిపిఎం పనిచేస్తుందన్నారు.
గత 15 రోజులుగా రాష్ట్రంలో ఉన్న 9000 మంది కి పైగా జూనియర్ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం వారిని బెదిరింపులకు గురిచేడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలగజేసుకొని జూనియర్ గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం అనేక సమస్యలపై వివిధ రూపాలలో ఆందోళన పోరాటాలు, నిర్వహిస్తున్నారని బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పేదల ఆధీనంలో ఉన్న భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మే19న జరిగే సుందరయ్య వర్ధంతిని వాడవాడల జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.