కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి
కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎవరు గెలిచినా లోకల్ గా ఉండరని, వారి స్థానంలో ఇతరులు ఉంటారని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. దోమకొండ, బిక్కనూర్ రాజంపేట, కామారెడ్డి మండలాల్లో మొదటి రోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు పెద్దఎత్తున రమణారెడ్డికి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ప్రచారంలో రమణారెడ్డి మాట్లాడుతూ.. తాను గెలిస్తే రైతుబంధు, పింఛన్లు రావని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేయడాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. ఎవరు గెలిచినా ప్రభుత్వ పథకాలు కొనసాగుతాయని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందన్నారు. గృహాలక్ష్మి, దళితబంధు, బిసిబంధు, మైనారిటీ బంధు పథకాలు వారి బంధువులకే వచ్చాయన్నారు. ఒకరేమో సీఎం, మరొకరేమో కాబోయే సీఎం అంటూ కామారెడ్డిలో పోటీకి వస్తున్నారని, వీళ్ళు గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారా అని ప్రశ్నించారు. కేసీఆర్ గెలిస్తే ఆయనను కలవడానికి గ్రామాల్లో లోకల్ లీడర్ ను పట్టుకుని గంప గోవర్ధన్ వద్దకు వెళ్లాలని, అక్కడినుంచి కేసీఆర్ వద్దకు వెళ్లాల్సి వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి గెలిస్తే ముందుగా నయీమ్ ను కలవాలని, ఆయన ద్వారా షబ్బీర్ అలీని కలవాలని, ఆ తర్వాతే రేవంత్ రెడ్డిని కలవాల్సి వస్తుందని తెలిపారు.
తాను గెలిస్తే మాత్రం లోకల్ గా ఉంటానని, ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటానని, తనను కలవడానికి ఎవరిని కలవాల్సి అవసరం ఉండదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. గెలిస్తే గజ్వేల్ లో రైతుల భూములు లాక్కుని వారిని అడ్డా కూలీలుగా మార్చారని, రేపు కామారెడ్డిలో కేసీఆర్ గెలిస్తే రైతుల భూములు లాక్కుంటారన్నారు. సొంత ఆస్తులు అమ్మి 150 కోట్లతో ఉచిత విద్య, వైద్యం, రైతు కల్లాలు, రైతు సేవా కేంద్రాలు, ఉచిత ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తానన్నారు. తాను గెలిస్తే అవినీతి రహిత కామారెడ్డి ఎలా ఉంటుందో చూపిస్తాననన్నారు. ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు
సత్యం న్యూస్, కామారెడ్డి