భారత రాజ్యాంగాన్ని మార్చే హక్కు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు లేదని తెలంగాణ బీసీ సేన రాష్ట్ర కార్యదర్శి జె వి రావు అన్నారు. మంగళవారం నాడు నారాయణ పేట్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని ఆయన హితవు పలికారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి నందుకే కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడని ఆయన అన్నారు. రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు అని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చెప్పడం వల్లనే తెలంగాణ ఏర్పాటు అయిందని ఆయన గుర్తు చేశారు.
రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఆధిపత్యం కొనసాగుతుందని, జనాభా ప్రాతిపదికన 2023 లో రాజ్యాధికారం బీసీలకు దక్కుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఒక శాతం ఉన్న రెడ్డిలు, వెలమలు రాజ్యాధికారం కొనసాగిస్తున్నారని వారికి రాబోయే ఎన్నికల్లో పరాభవం తప్పదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ ఏకమై తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.
నారాయణపేట జిల్లాలో బీసీలకు 65 శాతం ఓట్లు ఉన్నాయని రాబోయే ఎన్నికల్లో నారాయణపేట మక్తల్ నియోజకవర్గాలలో బీసీలదే ఆధిపత్యం కొనసాగుతుందని ఆయన అన్నారు. నూతనంగా ఎన్నికైన మక్తల్ నియోజకవర్గం అధ్యక్షులు ఎన్. రాములు ఈ ప్రాంత వాసులను చైతన్యపరిచి బీసీల రాజ్యాధికారం కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సేన జిల్లా అధ్యక్షులు సెలెటి వెంకటేష్ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు మహేష్ జిల్లా నాయకులు విజయ్ కుమార్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.