ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యక్తిగత స్వార్థపూరిత ఎజెండా తోనే యాసంగి ధాన్యం కొనుగోలు అంశాన్ని లేవనెత్తుతున్నారని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. యాసంగి లో వరి పంట వేయొద్దు అన్న పెద్ద మనుషులు వరి ధాన్యం కొనుగోలు అంశం ముందుకు ఎలా వస్తుందో వారే చెప్పాలని ఆయన అన్నారు. తరతరాలుగా తెలంగాణ లో వరి సాగు చేస్తున్నారు.
గత ప్రభుత్వాలు వారికి సరైన మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేశాయి. ముఖ్యమంత్రి రోజువారీ పాలనలో అవగాహనారాహిత్యం వల్లనే కొనుగోలు సమస్య ఏర్పడుతున్నదని ఆయన అన్నారు. ఇది కేవలం స్వార్థపూరిత రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని, హైదరాబాద్ లోని తన బినామీ సంస్థలపై గత వారం రోజులుగా జరుగుతున్న ఐటి దాడుల నుండి తెలంగాణ ప్రజల దృష్టి ని పక్కదారి పట్టించేందుకే ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ చేపట్టారని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. అప్పుచేసి కమీషన్ల కోసం ప్రాజెక్టులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి కోట్లాది రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి లూటీ చేసింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.
ఈరోజు రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తూ కేంద్రం చేత యాసంగి వరి కొనుగోలు చేయించ లేని పెద్దమనిషి ఉద్యమ వీరుల మని తెలంగాణ ప్రతిష్టను దిగజారుతున్నారని ఆయన అన్నారు. ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించి అసలు సిసలైన ఉద్యమకారులను పార్టీ నుండి బయటకు పంపించి, తెలంగాణ అమరుల సమాధులపై తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాక్షస పాలన సాగిస్తూ తన ఉనికికి ప్రమాదం ఏర్పడినప్పుడే ఉద్యమం గుర్తొస్తుందా కేసీఆర్ అని ఆయన ప్రశ్నించారు. గల్లీలో ప్రెస్ మీట్ ఢిల్లీలో సాష్టాంగ నమస్కారం ఇది కేసీఆర్ నైజం అని ఆయన విమర్శించారు.