దేశ వ్యాప్తంగా ప్రబలుతున్న కరోనా వైరస్ ను అరికట్టడంలో ముందంజలో వున్న రాష్ర్ట ప్రభుత్వం, ఇప్పటికే అప్రమత్తమై కరోనాను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలల్లో మరింత భరోసాను నింపేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కరీంనగర్ పర్యటనకు పూనుకున్నారు.
ప్రస్థుత పరిస్థితుల్లో సిఎం పర్యటన వల్ల అక్కడ భారీ స్థాయిలో జరుగుతున్న స్క్రీనింగు, వైద్య ఏర్పాట్లకు అసౌకర్యం కలగకుండా వుండాలని, కరీంనగర్ జిల్లా యంత్రాంగం, వైద్యశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి తదితరుల సూచనల మేరకు శనివారం సిఎం తలపెట్టిన కరీంనగర్ పర్యటన వాయిదా పడింది.
శుక్రవారం నాడు ముఖ్యమంత్రి రాష్ట్రంలో కరోనా పరిస్థితి సహా కరీంనగర్ లో జరుగుతున్న వైద్య ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పోలీస్ కమీషనర్లతో ఎప్పటికప్పుడు పలు మార్లు ఆరా తీసారు. వారు కూడా కరీంనగర్ లో జరుగుతున్న ఏర్పాట్ల విషయంలో సిఎం కు భరోసానివ్వడమే కాకుండా పర్యటనను వాయిదా చేసుకోవాలని కోరడంతో సిఎం పర్యటన వాయిదా పడింది.