ప్రమాదవశాత్తు మరో బాలుడు బోరుబావి గుంతలో పడిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట్ మండల పరిధిలోని పొడ్చన్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పొడ్చన్ పల్లికి చెందిన మంగళి బిక్షపతి కూతురు నవనీతను సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరుకు చెందిన గోవర్ధన్ కు ఇచ్చి వివాహం చేశారు. కరోనా నేపథ్యంలో నవనీత తన పిల్లలతో అమ్మగారి ఊరికి వచ్చింది. అయితే బుధవారం నాడు పొలంపనుల కోసం అమ్మానాన్నలతో కలిసి నవనీత కూడా పొలం దగ్గరకు వెళ్లింది. తన మూడేళ్ల కుమారుడైన సాయివర్ధన్ ను పొలం దగ్గర వదిలి పనులు చేసుకుంటున్న క్రమంలో ఆడుకుంటూ వెళ్లిన సాయివర్ధన్ పక్కనే ఉన్న బోరుబావిలో పడిపోయాడు.
బాలుడిని రక్షించడానికి రంగంలోకి దిగిన అధికారులు
ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ సాయివర్ధన్ ను రక్షించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాద విషయం తెలియగానే జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, పాపన్నపేట్ ఎస్ ఈ ఆంజనేయులు, రూరల్ సీఐ రాజశేఖర్ ఘటన స్థలానికి చేరుకుని బాలుడి రక్షణ చర్యలపై ఆరాతీశారు. ఇప్పటికే నాలుగు జేసీబీలుతో బోరుబావికి సమాంతరంగా గోతిని తవ్వుతున్నారు. అలాగే బాలుడికి ఆక్సిజన్ అందిస్తూ ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఎన్డీఆర్ ఎఫ్ బలగాలను కూడా రప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
యజమాని నిర్లక్ష్యం పసివాడికి ప్రాణసంకటం
ఈ మధ్యనే బోరుబావిని తవ్విన యజమాని దాన్ని అలాగే వదిలివేయడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బోరుబావిని తవ్వే క్రమంలో ప్రభుత్వ అనుమతి తప్పనిసరి తీసుకోవాలన్న నిబంధనలు ఉన్నప్పటికి అటు బోరుమోటార్ల యజమానులు ఇటు రైతులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ఎవరి ఇష్టారీతిగా వారు బోర్డు తవ్వేస్తున్నారు.