అమెరికాతో కుదిరిన అణు ఒప్పందంపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. 2018లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జో ఎంతో శ్రమపడి అమెరికాకు ఉత్తర కొరియాకు మధ్య రాయబారం నడిపి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ఉత్తర కొరియా అధినేత కిమ్ జంగ్ ఉన్ తో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో అమెరికా ఉత్తర కొరియా మధ్య అణు ఒప్పందాలు కుదిరాయి. అయితే వాటిని అమలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఈ జాప్యాన్ని ఉత్తర కొరియా భరించలేకపోతున్నది. దాంతో ఈ మొత్తం పరిస్థితికి కారణమైన దక్షిణ కొరియాను తీవ్రంగా హెచ్చరిస్తున్నది.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జంగ్ ఉన్ సోదరి కిమ్ యో జంగ్ ఈ మేరకు దక్షిణ కొరియాను నేరుగా హెచ్చరించారు. దక్షిణ కొరియాపై సైనిక చర్యకు తమ బలగాలకు పూర్తి అధికారాలు ఇవ్వబోతున్నట్లు ఆమె హెచ్చరించింది. ఉత్తర కొరియా అధినేతకు ఇటీవలి కాలంలో అత్యంత సన్నిహితురాలైపోయిన ఆయన సోదరికి ఆయన దక్షిణ కొరియాతో సంబంధాలకు అనుబంధ అంశాల పర్యవేక్షణ అప్పగించారు.
ఇరు దేశాల మధ్య అత్యంత కీలకమైన సరిహద్దు ప్రాంతమైన కియోసంగ్ ను కరోనా వైరస్ కారణంగా గత కొద్ది రోజులుగా మూసివేశారు. ఇక్కడ ఇరుదేశాల రాయబారుల కార్యాలయాలు ఉంటాయి. అత్యంత కీలకమైన ఈ ప్రదేశంపై తాము నిర్ణయం తీసుకుంటామని కిమ్ యో ప్రకటించింది.
అధినేత తనకు అప్పగించిన అధికారాల మేరకు దక్షిణ కొరియాను శత్రుదేశంగా ప్రకటించిన ఆమె తదుపరి చర్యలను తమ మిలిటరీ అధికారులు తీసుకుంటారని చెప్పారు. గతంలో కుదిరిన ఒప్పందాలన్నింటిని రద్దు చేస్తున్నట్లు కూడా ఆమె ప్రకటించారు.