తెలుగుదేశం పార్టీలో నవలా రచయితలు తయారయ్యారని ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ఈ మేరకు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈమధ్య జగనాసుర రక్త చరిత్ర అంటూ ఒక పుస్తకం విడుదలైందని, ఆ పుస్తకానికి ఎడిటర్ హోదాలో అచ్చెన్నాయుడే వ్యవహరించినట్లుగా ఉందని అన్నారు. పుస్తకంలో రచన, డైరెక్షన్, ప్రొడక్షన్ అన్నీ తెలుగుదేశం వారే కావడం విచిత్రమన్నారు.
గతంలో చంద్రబాబు తన సొంత మామ అయిన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి, చివరకు ఆయన మరణానికి పరోక్ష కారణమైనప్పటికీ ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకునే పరిస్థితి అందరికి తెలిసిందేనన్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా అత్యంత ప్రజాదరణ పొందుతున్న తరుణంలో కపట పుస్తకాలు చదివే ఖాళీ సమయం ప్రజలకు లేదన్నారు .కేవలం తమ ఉనికిని కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నో కుయుక్తులను పన్నుతున్నారని ధ్వజమెత్తారు.
14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజలకు ఏ మేలు చేశారో చెప్పాలన్నారు. రానున్న ఎన్నికలలో ఓటు అడిగే ధైర్యం ఆయనకు లేదని అన్నారు. హత్య రాజకీయాలు జరుగుతున్నట్లు మభ్యపెట్టి 2014లో ఏదో రకంగా గట్టెక్కి పబ్బం గడుపుకున్నట్లు చెప్పారు. సరైన పాలన అందించకే 2019లో ఓటమిపాలయ్యారని అన్నారు .ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి రహిత రాష్ట్రంగా పాలన సాగుతుందన్నారు.
ఆ ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు .ఏవో పుస్తకాలు సినిమాలు చూపించనంత మాత్రాన ప్రజలు నమ్మరన్న విషయాన్ని గుర్తించాలన్నారు. సైకిల్ పోవాలి … సైకిల్ పాలన వద్దు అంటూ స్వయంగా తండ్రీ కొడుకులైన చంద్రబాబు లోకేష్ ప్రసంగాలు చేయడం విడ్డూరమన్నారు. చివరికి జడ్జీల ఫోన్ లు కూడా ట్యాప్ అవుతున్నట్లుగా ప్రచారాన్ని చేస్తూ న్యాయ వ్యవస్థని కూడా గుప్పెట్లో పెట్టుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.
త్వరలో రాష్ట్రంలో ఇండస్ట్రియల్ సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో అనేక పరిశ్రమలు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. మారుమూల ప్రాంతంలో అమరావతిని ఏర్పాటు చేసి పరోక్షంగా పరిశ్రమలు రాకుండా చేసిన ఘనత బాబు దేనని అన్నారు. ప్రజా అవసరాలను తీర్చే బాధ్యత ప్రభుత్వానిదే అంటున్న అశోక్ గజపతిరాజు జిల్లాలో అనేక సంవత్సరాలుగా మంత్రిగా ఉన్న ఆయన ప్రజలకు ఏ అవసరాలు తీర్చారో చెప్పాలని అన్నారు.
ప్రజలకు కష్టసుఖాలను పట్టించుకోని ఆయన ప్రజావసరాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తాము ప్రజల మధ్యలోనే ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఒక సాధారణ పౌరుడిగా భీశెట్టి బాబ్జి క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ధర్నా చేస్తే అక్కడకు అశోక్ వెళ్లి సంఘీభావం తెలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మంత్రిగా, శాసనసభ్యుడిగా, కేంద్రమంత్రిగా ఉన్న ఆయన సమయంలో అటువంటి ఆస్పత్రి ఏర్పాటుకు ప్రయత్నాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మాన్సాస్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కూడా అడ్డంకిగా నిలిచారని అన్నారు. తాను గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఆంధ్ర యూనివర్సిటీ విస్తరణ, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కేంద్రీయ విద్యాలయ వంటివి ఏర్పాటుకుకృషి చేసినట్లు చెప్పారు.
తమ హయాంలో తాను జేఎన్టీయూని విశ్వవిద్యాలయం, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేసామన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉంటూ కేవలం పదవులు అలంకరించడానికే తాపత్రయపడ్డారని తెలుగుదేశం నాయకులనుదేశించి అన్నారు. ప్రస్తుతం ప్రజల దగ్గరకు వెళ్లి ఓటు అడిగే అర్హత తెలుగుదేశం పార్టీకి ఉందా అని ప్రశ్నించారు.
చంద్రబాబుకు పదవీ దాహం ఎక్కువ అని అటువంటి సమయంలో లోకేష్ కు చంద్రబాబు హాని తలపెట్టే ప్రయత్నాలు కూడా చేయవచ్చునన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృతంలో ప్రజా రంజక పాలన సాగడం వలన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల చెంతకు ధైర్యంగా వెళుతూ ప్రభుత్వ పథకాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.
లోకేష్ ను ప్రజలు రాజకీయంగా ఆహ్వానించ లేకపోవడం వల్లే నాయకుడిగా చిత్రీకరించేందుకు చంద్రబాబు నానా పాట్లు పడుతున్నారని అన్నారు. అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యాలు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజా అవసరాలలో మెరుగైన పాలన అందిస్తూ అందరి ఆమోదాన్ని కోరుతున్నామన్నారు. 617 కోట్ల రూపాయలతో తెలంగాణలో సచివాలయ భవనాన్ని నిర్మిస్తే ,900 కోట్లు ఖర్చుపెట్టి అమరావతి అంటూ అతిగతి లేకుండా చేసిన ఘనత చంద్రబాబు దేనని తూర్పారబెట్టారు.
గతంలో జన్మభూమి కమిటీల పేరిట దోచుకోవడమే జరిగిందని అన్నారు. ప్రస్తుతం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందిస్తూ సుపరిపాలన సాగుతుందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే గెలుపని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు.