బీఆర్ఎస్ మంత్రి కొప్పుల ఈశ్వర్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదంటూ ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేవేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ను దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. కొప్పుల దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను తిరస్కరించింది. లక్ష్మణ్ పిటిషన్పై అడ్వకేట్ కమిషన్ దగ్గర వాదనలు ముగిశాక.. ఇప్పుడు ఆ పిల్ను కొట్టేయడం సాధ్యం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
ఎన్నికల సందర్భంగా తప్పుడు అఫిడవిట్ సమర్పించడంతో కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా నాగేశ్వర్ రావుపై తెలంగాణ హైకోర్టు వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల ఎన్నికల వివాదాలపై కోర్టుల్లో ఎలాంటి తీర్పులు వస్తాయో అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.