ముంపు బాధితుల సహాయక చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ నగరంలోని ధాంసలాపురం కాలనీలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించి, పారిశుద్ధ్య తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వరద స్థాయి ఏ మేరకు వచ్చింది, ఎన్ని ఇండ్లు ముంపుకు గురయ్యాయి, ఎంత మంది పునరావాస కేంద్రాలకు వెళ్లారు అడిగి తెలుసుకున్నారు.
మున్నేరు ఉధృతికి ధాంసలాపురం లో ఇంత వరద ఎలా వచ్చిందని అడగగా, ధాంసలాపురం చెరువు పొంగి పొర్లడంతో, దానికి మున్నేరు తోడైనట్లు అధికారులు తెలిపారు. కాలనీలో పారిశుద్ధ్య పనులు చురుగ్గా జరిగాయని ఆయన తెలిపారు. నీటి నిల్వలు లేకుండా చూడాలని, నీరు నిల్వ వున్న చోట దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయాలని ఆయన అన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు.
ముంపుకు గురయిన ఇండ్ల వివరాలతో నివేదిక ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు ఆయన అన్నారు. ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మేడారపు వెంకటేశ్వర్లు, మునిసిపల్ కార్పొరేషన్ ఉప కమీషనర్ మల్లీశ్వరి, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.