టిఆర్ఎస్ పార్టీ కి సోషల్ మీడియా ఓ బలం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అన్నారు. తెలంగాణ భవన్ లో నేడు ఆయన సోషల్ మీడియా కార్యకర్తల సమావేశం లో మాట్లాడారు. ప్రజల్లో ఆదరణ ఉండే పార్టీ కి సోషల్ మీడియా అదనపు బలంగా ఉంటుందని ఆయన అన్నారు.
టిఆర్ఎస్ పార్టీ కి సోషల్ మీడియాలో 11 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని, ఏ పార్టీ తమకు దరిదాపుల్లో కూడా లేదని ఆయన అన్నారు. టిఆర్ఎస్ కు సోషల్ మీడియా లో పెయిడ్ వర్కర్స్ లేరని కేవలం పార్టీపై అభిమానంతో, ప్రేమ తో సోషల్ మీడియా సైనికులు పని చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం లో కూడా వాస్తవాలు వివరించింది మన సోషల్ మీడియా కార్యకర్తలేని ఆయన అన్నారు.
కొన్ని పార్టీ లకు పెయిడ్ సోషల్ మీడియా కార్యకర్తలు తప్ప అభిమానులు లేరని అయితే ప్రజల్లో ఏ బలం లేకుండా కేవలం సోషల్ మీడియా తో పార్టీ లు మనుగడ సాధించలేవని ఆయన అన్నారు. కొందరు, కొన్ని పార్టీ లు చిచ్చు పెట్టేందుకే సోషల్ మీడియా ను వాడుకుంటున్నారని, టిఆర్ఎస్ మాత్రం ఎపుడూ సోషల్ మీడియా ను ఉద్రిక్తతలు పెంచేందుకు వాడుకోలేదని ఆయన అన్నారు.