వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం బయోమెట్రిక్ తోవ నుంచి వెళ్లిన తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ కుటుంబం ఆ తప్పును తెలిసి చేసిందా లేక తెలియక చేసిందా అనే అంశంపై విస్తృతమైన చర్చ జరుగుతున్నది. బయోమెట్రిక్ తోవ నుంచి ఆలయ సిబ్బంది తప్ప మరెవరూ వెళ్లేందుకు అనుమతి లేదు.
ఆ ద్వారం నుంచి భక్తుల ఆలయ ప్రవేశం ఆగమ శాస్త్రం ప్రకారం కూడా నిషిద్ధం. వైకుంఠ ఏకాదశి రోజున కేటీఆర్ కుటుంబ సభ్యులతో సహా టిటిడి బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెంటరాగా నేరుగా ఆ ద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేశారు.
వైకుంఠ ద్వారాలను ముహూర్తం ప్రకారం తెరవాల్సి ఉండగా కేటీఆర్ కుటుంబ సభ్యుల కోసం 27 నిమిషాల ముందుగానే తెరచినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలి దర్శనం కేటీఆర్ కుటుంబం చేసిన తర్వాతే వైకుంఠంలో వేచి ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వివిధ రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులను దర్శనానికి అనుమతిచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయాలన్నీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలియకుండానే జరిగాయి. వారు వైకుంఠం లో వేచి ఉండగానే తెలంగాణ మంత్రిని దర్శనానికి పంపడం ఏ ప్రోటోకాల్ ప్రకారం జరిగిందనే విషయం ఇప్పుడు మరో వివాదంగా మారింది.
వైకుంఠంలో వేచి ఉన్న ఈ ముఖ్యులకు ప్రోటోకాల్ నిబంధన ప్రకారం ముందే దర్శనం ఇవ్వాల్సి ఉన్నా టిటిడి అధికారులు ఓవర్ యాక్షన్ చేసినట్ల ఆ తర్వాత కిషన్ రెడ్డికి, రామచంద్రారెడ్డికి తెలిసి అవాక్కయ్యారు. ప్రోటోకాల్ విఐపిలకే దిక్కులేకుండా పోయిన ఆ రోజున కంపార్టుమెంట్లలో సాధారణ భక్తులను 36 గంటల పాటు బంధించి ఉంచారు. మేం బయటకు వెళ్లిపోతాం వదిలేయండి అని బతిమాలినా కూడా కంపార్టు మెంట్ల నుంచి భక్తులను వదల్లేదు.
దేవుడి దర్శనం కూడా వద్దు మేంవెళ్లిపోతాం అని బాధతో భక్తులు ఆక్రందనలు చేసినా అధికారులు తాళాలు తెరవలేదు. చెరసాల బాధను తట్టుకోలేక వేలాది మంది భక్తులు ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయినా సరే వారిని 36 గంటల పాటు బంధించి ఉంచారు. దీనిపై మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించాలని కొందరు ప్రయత్నిస్తున్నారు.