కూకట్ పల్లి రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చేసుకుంటున్నట్లుగానే ఇక్కడ అదే తరహా రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. కూకట్ పల్లిలోనూ బీజేపీ తన దూకుడు పెంచింది. బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి నేతృత్వంలో టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులను మెల్లగా బీజేపీలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.
కూకట్ పల్లిలో టీఆర్ ఎస్ కంచుకోటను ఢీ కొట్టేందుకే గట్టిగానే ప్రయత్నిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా ఏకంగా సీఎం కేసీఆర్ దగ్గరి బంధువు, ఎమ్మెల్సీ నవీన్ రావు స్వయానా బావ, టీటీడీ బోర్డు అడ్వైజరి కమిటీ ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి రాజేశ్వర్ రావును బీజేపీలోకి తీసుకువచ్చేందుకు గట్టి ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే శ్రావణ శుక్రవారం బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి వడ్డేపల్లి రాజు ఇంటికి వచ్చి కలవడం, ఇద్దరు సుమారు గంటకుపైగా చర్చలు జరపడం ఈ వార్తలకు మరింతబలం చేకూరుస్తుంది. త్వరలోనే వడ్డేపల్లి రాజు బీజేపీ తీర్ధం పుచ్చుకొనున్నారని, ఆయన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో టచ్ లో ఉన్నారని, ఇటీవల తనతో పాటు బీజేపీలోకి రావాల్సిందిగా రాజగోపాల్ రెడ్డి ఓ పెళ్లిలో కలిసి కోరినట్లు సమాచారం. అదే జరిగితే కూకట్ పల్లిలో తెరాసకి పెద్ద దెబ్బనే చెప్పాలి. అందులోనూ ఎమ్మెల్సీకి స్వయానా బావ కావడం, కేసీఆర్ ఫ్యామిలీకి దగ్గరివారవడంతో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.