గతంలో టీడీపీ ప్రభుత్వ హాయాంలో తీసుకొచ్చిన రైతుబజార్లు..అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయా…? ఇదే అంశం.. విజయనగరం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ఎమ్మెల్యే సీరియస్ గానే వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు వార్నింగ్ ఇచ్చారు.
ఈ మేరకు దాదాపు 60 లక్షల తో విజయనగరంలోని ఆర్ & బి రైతు బజారు, రింగు రోడ్డు రైతు బజార్లలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, నగర్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, ఏఎంసీ వైస్ ఛైర్మన్ రెడ్డి గురుమూర్తి, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొని పూజా క్రతువులు నిర్వహించారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ రెండు రైతు బజార్లలో ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఏఎంసీ వైస్ ఛైర్మన్ రెడ్డి గురుమూర్తి పేర్కొన్నారు. రైతులకు, దుకాణదారులు, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా అభివృద్ధి పనులు చేపడతామని వివరించారు.
తాగునీటి వసతి, విద్యుదీకరణ, టైల్స్ తో కూడిన నడక దారి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.మార్కెటింగ్ శాఖ డీఈ దాసరి కోటయ్య రెండు రైతు బజార్లో చేపట్టబోయే పనుల గురించి వివరించారు. 60.57 లక్షల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న షెడ్లను తొలగించి వాటి ఎత్తు పెంచి కొత్తవి నిర్మిస్తామని, విద్యుదీకరణ, తాగునీటి వసతి కల్పనకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అవసరమైన చోట మరమ్మతులు కూడా చేపడతామని తెలిపారు. రెండు నెలల్లో పనులను ప్రారంభిస్తామని దుకాణదారులకు, వినియోగదారులకు మెరుగైన సదుపాయాలు కల్పించి రైతు బజార్లను అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు.
దుకాణదారులతో ఎమ్మెల్యే మాటామంతీ
పనుల ప్రారంభోత్సవం అనంతరం స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి రైతు బజార్లలో ఉన్న దుకాణదారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ కమిటీ విధించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, వినియోగదారులకు ఇబ్బంది కలిగించకుండా వ్యాపారాలు చేసుకోవాలని హితవు పలికారు.
సమయ పాలన పాటించాలని, రాత్రి పూట రింగు రోడ్డు రైతు బజార్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందని.. ఇలాంటివి పునరావృతం అయితే ఉపేక్షించేది లేదని స్థానిక మార్కెటింగ్ శాఖ అధికారిని ఎమ్మెల్యే హెచ్చరించారు.
ఈ కార్యక్రమాల్లో నగర్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, మార్కెటింగ్ కమిటీ వైస్ ఛైర్మన్ రెడ్డి గురుమూర్తి, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, మార్కెటింగ్ శాఖ డీఈ దాసరి కోటయ్య, సహాయ సంచాలకులు వై.వి. శ్యామ్ కుమార్, ఎస్టేట్ అధికారులు గంగాధర్, సతీష్ లు తదితరులు పాల్గొన్నారు.