డ్వాక్రా మహిళలు, వాలంటీర్లను తరలించి, బస్సులను ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ అట్టర్ ఫ్లాప్ అయిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపూర్ పార్లమెంటు సభ్యుడు కె. రఘురామ కృష్ణంరాజు అన్నారు. ప్లీనరీ కి హాజరైన జనాభా గురించి ఉప ప్రాంతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన వీడియో ను మీడియా ముందు ఆయన ప్రదర్శించారు.
20 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయిందన్న విజయసాయి వ్యాఖ్యలపై రఘురామ స్పందిస్తూ… చెక్ పోస్ట్ వద్ద వాహనాలను ఆపి ఏరియల్ వ్యూ ద్వారా ఫోటో తీసి, గ్రాఫిక్స్ లో మరిన్ని వాహనాలను కలిపారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ కోసం ఎన్ని చదరపు అడుగులలో షామియానాలు వేశారో… పలుచగా వేసిన కుర్చీలు ఎన్నో దాన్నిబట్టి సభకు హాజరైన జనాలను లెక్కించవచ్చునన్నారు.
ప్లీనరీకి 40 నుంచి 70 వేల మంది హాజరైతే, తొమ్మిది లక్షల మంది హాజరైనట్లుగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్లీనరీకి హాజరైన జనం గురించి చెప్పుకోవడం ఎందుకనీ, పడుకున్నవానితో లేపి తన్నించుకోవడం ఎందుకన్నారు. దానికి తనకు, ఏబీఎన్ రాధాకృష్ణకు తిట్లు… ఈనాడుకు పొగడ్తలా అని ప్రశ్నించారు.
ఈనాడు దినపత్రిక ఏమి బ్రహ్మాండం భజగోవిందం అని రాయలేదని, ప్లీనరీకి హాజరైన వారు ఎంతమందో మాత్రమే రాయలేదని గుర్తు చేశారు. సభకు హాజరు కావడం అంటే ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభకు హాజరైనట్లుగా హాజరు కావాలన్నారు.. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిన ఎద్దుల బండ్లనున కట్టుకొని ప్రజలు హాజరయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో తాము ఎవరిని సంప్రదించలేదని బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ స్పష్టం చేశారని, తాను ఇదే విషయాన్ని గతంలో చెప్పానని గుర్తు చేశారు.
విజయ సాయి ట్వీట్ చదివితే మళ్ళీ ఓటే వేయరు…
తమ ఉప ప్రాంతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తన గురించి చేసిన ట్వీట్ చదివితే, ఆ భాషను చూసి ప్రజలు మళ్లీ మా పార్టీకి ఓటే వేయరని అన్నారు. తెలుగు ప్రజలకు సెంటిమెంట్ ఎక్కువ అని, తల్లి… చెల్లి సెంటిమెంట్ లతో వచ్చిన సినిమాలన్నీ సూపర్, డూపర్ హిట్ అయ్యాయని తాను ఒక జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పానని రఘురామా వెల్లడించారు.
ప్లీనరీలో ఒక మంత్రి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తల్లి స్థానం విజయమ్మకు ఉన్నదని చెప్పడం పట్ల ఆమె అభిమానిగా సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో విజయమ్మ, ప్రత్యేకించి షర్మిల భాగస్వామ్యం ఎంతో ఉన్నదని రఘురామ అన్నారు.