రైతు రుణమాఫీని సత్వరం పూర్తి చేసి తిరిగి పంట రుణాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్ డిమాండ్ చేశారు. పాలక వర్గాలు రుణమాఫీ ప్రకటించి చాలా రోజులు గడిచిన అమలు మాత్రం జరగడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. రుణమాఫీని సత్వరం పూర్తి చేయాలని, పంటల బీమాను అమలు చేయాలని పెద్ద ఎత్తున నినదించారు. అందోళనకారులను ఉద్దేశించి దొండపాటి రమేష్ మాట్లాడుతూ వాగ్దానాలు చేయడం వాటిని విస్మరించడం అలవాటుగా మారిందని ముఖ్యంగా పాలక వర్గాలు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయన్నారు.
పారిశ్రామిక వేత్తలకు వేల కోట్ల రూపాయల అప్పులను మాఫీ చేసిన పాలకులకు రైతుల లక్ష రూపాయల పంట రుణాన్ని మాఫీ చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. పంట రుణమాఫీ తక్షణం అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తగు సమాధానం చెప్పక కప్పడని ఆయన హెచ్చరించారు. ప్రతి యేటా లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన తర్వాత పంటలకు దిగుళ్లు సోకి ప్రకృతి ప్రకోపానికి రైతులు నష్టపోతున్నారని పంటల బీమా పథకం అమలు చేయాలన్నారు. 50 ఏళ్లు నిండిన రైతులకు నెలకు ఐదు వేల రూపాయల పింఛన్ సౌకర్యం కల్పించాలని దొండపాటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల పరిస్థితి దయనీయంగా ఉందని సాగర్ జలాలను విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని ఆయన కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాగర్ల మూడి రంజిత్, రైతు సంఘాల నాయకులు. బానోత్ రామ్మూర్తి, కూచిపూడి రవి, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, పుచ్చకాయల మధాకర్, శంకరయ్య, స్వర్ణ రమేష్, దొబ్బల కృష్ణ, పాపగంటి సుదర్శన్, సివి రావు, వెంకయ్య, కట్ల సత్యం, నాగభూషణం, గోపయ్య తదితరులు పాల్గొన్నారు.