జంపన్న వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో జులై 27న ఎనిమిది మంది తమ గ్రామస్తులను కోల్పోవడము, అపారంగా ఆస్తి నష్టం జరగడంతో పాటు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకడం తమను పీడకలగా వెంటాడుతున్నదని, ముంపు ప్రాంతమైన కొండాయి గ్రామంలో నివసించడం ఎంత ప్రమాదకరమో తమకు తెలిసివచ్చిందని కొండాయి గ్రామ సర్పంచ్ అన్నారు. కొండాయి గ్రామ సర్పంచ్ కాక వెంకటేశర్వలు, వార్డ్ మెంబర్లు, వివిధ కుల పెద్దలు పదిహేనుమంది కలిసి ములుగు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ తో తమ గోడు వెళ్లబోసుకున్నారు.
తమకు దగ్గర్లోని ఎత్తైన సురక్షిత ప్రాంతం లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, తమను సురక్షిత ప్రాంతానికి తరలిస్తే బదులుగా తాము ప్రస్తుతం ఉంటున్న సుమారు 16 ఎకరాల గ్రామ కంఠ భూమిని స్వచ్చందంగా ప్రభుత్వానికి అప్పజెబుతామని ఈ మేరకు తమ గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశామని అలాగే కొండయిలోని ఓటు హక్కు కలిగిన ప్రతి ఇంటి నుండి మొత్తం 280 మంది తో సంతకాల సేకరణ చేశామని కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో తమను ఆదుకోవాలని అభ్యర్ధించారు. ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడానికి కొండాయి గ్రామ సర్పంచ్ కాక వెంకటేశ్వర్లు, వార్డ్ మెంబర్లు ఆలం సుశీల, బరిగెల బాబు, కులపెద్దలు అట్టం నాగరాజు, పరికి నాగయ్య, పరికి నర్సింగ రావు, వాసంపెల్లి సారయ్య, దబ్బకట్ల రాజారాం, మహేందర్ తదితర గ్రామస్తులు పదిహేనుమంది ఉన్నారు.
కొండాయి ప్రజల అభ్యర్ధన సమంజసమే: పింగిలి నాగరాజు
గత నెలలో నా ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్ నుండి సహకారం అందించడానికి కొండాయి వెళ్లగా గ్రామస్తులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు పునరావాసం కల్పించాలి అనే వారి అభ్యర్ధన సమంజసమే అనిపించి గ్రామసభలో తీర్మానం చేసి, సంతకాల సేకరణ చేయమని సూచించగా వారు ఆ విధంగానే పట్టుదలతో అన్ని పూర్తిచేసుకుని కలెక్టర్ గారిని కల్పించమని కోరగా ఈ రోజు వారిచే ప్రజావాణిలో తమ విజ్ఞాపనను నమోదు చేయించాను. తమ సొంత ఇళ్ల స్థలాలను ప్రభుత్వానికి వదిలివేస్తామని గ్రామస్తులు చెప్పడమీ గాక సంతకాలు చేసి ఇవ్వడం వారి చిత్తశుద్దికి నిదర్శనం కాబట్టి 343 మంది కొండాయి గ్రామస్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారికి పునరావాసం కల్పించాలని నేను కూడా నా ట్రస్ట్ తరఫున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.