కరోనా కట్టడికి వ్యాపారులంతా కలిసి రావాలని నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గంలోని చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో వ్యాపారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరోనా పెరిగిపోతోందని దాన్ని అరికట్టడం మనకు మాత్రమే సాధ్యమని అన్నారు.
వ్యాపార సంస్థల ద్వారా కరోనా ఎక్కువగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వ్యాపారాలు నడిచినంత సేపు వినియోగదారులు ఉంటూనే ఉంటారని అన్నారు. కాబట్టి వ్యాపారులు తమ వ్యాపార సమయాలను కుదించుకోవాలని ఆయన సూచించారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు కొనసాగించాలని అన్నారు.
మందుల దుకాణాలు, ఎరువులు, ఆటో మొబైల్ దుకాణాలకు మినహాయింపు ఉంటుందని అన్నారు. సమయ పాలను నెల రోజుల పాటు పాటించాలని తెలిపారు. వ్యాపారులు వినియోగదారుల కు శానిటైజర్ అందించాలని, మాస్కులు లేని వారిని లోనికి రానివ్వకూడదని సూచించారు.
అనవసరంగా ప్రజలు రోడ్ల మీదికి రాకూడదని, మాస్కులు లేని వారికి మున్సిపాలిటీ అధికారులు, పోలీసులు జరిమానాలు విధించాలని ఆదేశించారు. మన మనుగడ కోసం మనం తీసుకుంటున్న జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ పాటించి కరోనా నివారణకు తోడ్పడాలని లింగయ్య కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్, కమీషనర్ ఐతే ప్రభాకర్, ఎస్ ఐ నాగరాజు, నాయకులు జడల ఆదిమల్లయ్య, మెండే సైదులు, గుండెబోయిన సైదులు, జిట్టా బొందయ్య, బెల్లి సత్తయ్య, సిలివేరు శేఖర్, కోనేటి కృష్ణ, పందిరి రమేష్, పొన్నం లక్మయ్య తదితరులు పాల్గొన్నారు.