జనగామ జిల్లా పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ కి పాల్పడుతున్న దొంగల ముఠాను జనగామ పోలీసులు అరెస్టు చేశారు. జనగామ సీఐ మల్లేష్ యాదవ్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.
జనగామ కు చెందిన సి శ్రీనివాస్, అర్ సందీప్, యాదాద్రి జిల్లా కు చెందిన సి సిద్దిరాములు జల్సాలకు అలవాటు పడి డబ్బుల సంపాదనకు జనగామ, చేర్యాల, ఆలేరు పరిసర ప్రాంతాల్లోనీ టీవీఎస్ వాహనాలతో పాటు ఇతర ద్విచక్ర వాహనాలను తరచుగా దొంగతనాలకు పాల్పడుతూ ఉండేవారు.
ఇదే క్రమంలో ఇటీవల జనగామలో పలు ద్విచక్ర వాహనాలు దొంగిలించారు. ఫిర్యాదులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు ద్విచక్ర వాహన దొంగలముఠా పై కన్నేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించారు. వారి వద్ద నుండి రెండు లక్షల విలువ చేసే 6 టీవీఎస్ ఎక్సెల్ వాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్సైలు రాజేష్ నాయక్, శ్రీనివాస్, రవికుమార్ ఉన్నారు.