(సత్యం న్యూస్ ప్రత్యేకం)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న ప్రజారోగ్య విధ్వంసం బాధిత దేశాల ఆర్ధిక వ్యవస్థలనూ కోలుకోలేని విధంగా దెబ్బతీస్తోంది. పూర్తి స్థాయి లాక్ డవున్ విధించిన కారణంగా పలు ఉత్పత్తి రంగాలు, సేవారంగాలు, వ్యాపార,వాణిజ్య కేంద్రాలు తదితర ఆదాయ వనరులు మూతబడటంతో ప్రభుత్వాలు భారీ మొత్తంలో ఆర్థిక నష్టాలకు గురౌతున్నాయి.
ఈ దుర్భర నేపథ్యంలో దాదాపు అన్ని దేశాలూ మరో ఆర్ధిక సంక్షోభం వైపు పయనిస్తున్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే సంక్షోభంలో మునిగిపోయాయి. ఇవన్నీ మరో భయానక సమస్యవైపు దారితీస్తున్నాయి. అదే……నిరుద్యోగ సమస్య. ఆర్ధిక పరిస్థితి మందగమనంలో ఉంటేనే నిరుద్యోగ సమస్య పెరుగుతున్నది.
ఇక ఆర్ధికంగా సంక్షోభంలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అమెరికా మొదలు అన్ని దేశాల లో ఆర్థిక మాంద్యం నెలకొన్నప్రస్తుత తరుణంలో పెరుగుతున్న నిరుద్యోగ రేటు ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. బోస్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ బ్లూ సైయిర్ “సం క్షోభంలో మరో సంక్షోభం వస్తోంది” అన్నారు.
కరోనా ప్రభావంతో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య మరో సంక్షోభం కానున్నదని ఆయన సోదాహరణంగా వివరించారు. భారతదేశం విషయానికి వస్తే…ఇటీవల జరిగిన పలు సర్వేలలో దిగ్భ్రాంతి కలిగించే అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
సెంటర్ ఫర్ ది మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమి తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలు ప్రకారం- దేశ ఆర్థిక చరిత్రలోనే మొదటి సారి నిరుద్యోగుల సంఖ్య రికార్డు స్థాయి లో పెరిగినట్లు తెలిసింది. 137 కోట్లకు పైగా ఉన్న దేశ జనాభాలో దాదాపు 103కోట్ల మంది 18 ఏళ్ళ వయస్సు పై బడిన వారు ఏదో ఒక పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపింది.
2020 ఫిబ్రవరి నాటికి 40.4 కోట్ల భారతీయులు వివిధ రంగాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కాగా…3.4 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నట్లు సర్వే లెక్కలు తెలిపింది. లాక్డవున్ ప్రకటన నేపథ్యంలో 2020 మార్చి నాటికి దేశంలో ఉద్యోగుల సంఖ్య 28.5 కోట్లకు తగ్గింది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే దాదాపు 11.1 కోట్ల మంది నిరుద్యోగులు కావడం, అంటే ఉపాధి కోల్పోవడం అంటే సమస్య తీవ్రతను తెలుపుతోంది.
వీరిలో సుమారు 8 కోట్ల మంది వారి కుటుంబాలకు ఏకైక సంపాదనపరులు గా సర్వే స్పష్టం చేసింది. లాక్డవున్ ప్రభావం కారణంగా ఇంతమంది భారతీయులు ఒక్కసారిగా నిరుద్యోగులైతే పర్యవసానం దారుణంగా ఉంటుందని ఊహించడం కష్టం కాదు. జాతీయ సాంపిల్ సర్వే (ఎన్ ఎస్ ఓ) కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.
దేశ జనాభాలో 1/3 వ వంతు మందికి ఆర్థిక సంక్షోభం సెగ తగలక తప్పదని తేల్చి చెప్పింది. 136 కోట్ల మందికి ఇది గడ్డుకాలంగా విషమించనుందని ఎన్ ఎస్ ఓ హెచ్చరించడం గమనార్హం. 56% హోటల్, ట్రావెల్స్ రంగం, 38% ఆటోపరిశ్రమకు సంబంధించిన రంగాలు, 26% ఔషధ పరిశ్రమలు,11% ఇన్సూరెన్స్, 9% ఐటీ పరిశ్రమలకు నష్టం వా టిల్లినట్లు మరో సర్వేలో వెల్లడి అయింది.
ఇంకా ఏవియేషన్, ఉత్పాదక వ్యవస్థలు, నిర్మాణ రంగం తో పాటు దాదాపు అన్ని రంగాలలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు, రోజువారీ లేబర్ పనివారు, ఫ్రీలాన్సర్లు తీవ్ర ఆర్థిక సమస్యలకు బలయ్యే ప్రమాదం ఉంది. వాస్తవ ముఖచిత్రం ఈ విధంగా ఉన్న దుర్భర పరిస్థితి లో ప్రజా ప్రభుత్వాలు సత్వరం స్పందించి తగిన కార్యాచరణ తో ముందుకు వచ్చి నిరుద్యోగులను ఆదుకోవాలని ఆర్ధిక నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు.
చిన్న, మధ్యతరగతి పరిశ్రమ లకు తగిన ఆర్థిక సహకారం అందించాలని, తద్వారా కొంత మేరకైనా నిరుద్యోగ రేటు తగ్గే అవకాశం ఉంటుంద ని ఆశా భావం వ్య క్తం చేశారు. అలాగే కరోనా ప్రభావం అంతగా లేని ప్రాంతాలలో గ్రామీణ ఉపాధి
కల్పనా అవకాశాలను అన్వేషించాలని ప్రభుత్వాలకు సూచనలు వస్తున్నాయి.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఇలకు ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీ ఎంత వరకూ ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ఉపకరిస్తుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తారుమారైన కుటుంబాలకు మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్నీఅందించి వారిలో నెలకొన్ననిరాశ, నిస్పృహ లను పారద్రోలే విధంగా పాలకులు క్షేత్ర స్థాయి చికిత్సా కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తే మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు.
ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆకలి చావులు చోటుచేసుకునే ప్రమాదాన్ని గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం కావాల్సిన ఉత్కృష్ట సమయమిది.
కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి