కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని వారికి, రైతులకు కూడా సౌకర్యంగా ఉండేలా ఒక కొత్త మామిడి పండ్ల పథకం సిద్ధమైంది. పోస్టు ద్వారా మామిడి పండ్లను అందించేందుకు తెలంగాణ ఉద్యాన శాఖ తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆర్డర్ ఇచ్చిన నాలుగు లేదా ఐదు రోజుల్లో మామిడి పండ్లు ఇంటికి పంపిస్తామని ఉద్యాన శాఖ సంచాలకులు బి.వెంకటరెడ్డి చెప్పారు. నేరుగా మామిడి తోటల నుంచి పక్వానికి వచ్చిన కాయలను సేకరించి వాటిని శాస్త్రీయంగా అట్టపెట్టెలో మగ్గపెట్టి అలాగే అందిస్తారు.
5 కిలోల మామిడి పండ్ల బుట్టలో 12-15 వరకూ ఉంటాయి. ఎన్ని కిలోలు కావాలి, ఏ రకం మామిడి పండ్లు అనేది చెబితే చాలు..! రైతుల దగ్గర అందుబాటులో ఉండే రకాలు.. మీకు కావాల్సిన మామిడి పండ్ల పరిమాణాన్ని బట్టి ధరలో వ్యత్యాసం ఉంటుంది.
మామిడి పండ్లు కావాల్సిన వారు ఎంత మొత్తంలో కావాలనుకుంటున్నారో అనే విషయాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 79977 24925, 79977 24944 నంబర్లకు వాట్సాప్ చేయాలని ఉద్యాన శాఖ సూచించింది. గూగుల్ పే, ఫోన్పే ద్వారా నగదు చెల్లించాలనుకునేవారు 79977 24925 నంబరును వినియోగించాలి.
బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించాలనుకుంటే అకౌంట్ నంబరు 013910100083888, ఐఎఫ్ఎస్సీ కోడ్: ఏఎన్డిబీ0000139, ఆంధ్రాబ్యాంక్, గగన్మహల్ శాఖలో జమ చేయాలి. వినియోగదారులు పూర్తి చిరునామా, పిన్కోడ్ నంబరుతో పాటు ఫోను నంబరును సందేశం ద్వారా పంపించాలి.
5 కిలోల బంగినపల్లి మామిడి పండ్ల పెట్టె ధర తపాలా శాఖ ద్వారా ఇంటికి పంపే ఖర్చులతో సహా రూ.350గా నిర్ధారించారు.