(సత్యం న్యూస్ ప్రత్యేకం)
దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం కరోనా వైరస్ ఉన్నదా? వైరస్ వ్యాపిస్తున్న తీరు, సంభవిస్తున్న మరణాల సంఖ్యను ఇతర దేశాల లెక్కలతో పోల్చుకుంటే ఈ అనుమానం బలపడుతున్నది. భారతదేశంలో మూడు రకాల వైరస్ లు ఉన్నాయని పరిశోధకులు ఒక నిర్ణయానికి వచ్చారు.
వివిధ రాష్ట్రాల లో ఉన్న వివిధ రకాల వైరస్ ల ప్రభావంతో వైరస్ వ్యాప్తి, కోలుకున్నవారి సంఖ్య, మరణాల రేట్లలో తేడాలున్నాయని పరిశోధకుల విశ్లేషణ. అందుకే వైరస్ నిరోధక వాక్సిన్ సకల ప్రయోగాల అనంతరం చికిత్స కొరకు అందుబాటులోకి రావడానికి ఒక సంవత్సరం నుంచి రెండేళ్ళ కాలం పడుతుందని అంటున్నారు.
లాక్డడౌన్ పొడిగించేందుకే రాష్ట్రాల సుముఖత
ఐతే డ బ్ల్యూ హెచ్ ఓ లేదా ప్రభుత్వం ప్రకటించే విశ్వసనీయ సమాచారాన్నే శ్రేయస్కరం గా గుర్తించాలి. ఈ నేపథ్యంలో లాక్ డవున్ పొడిగింపుపై కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రధాన మంత్రి నిన్న నిర్వహించిన వర్చువల్ వీడియో సమావేశంలో కరోనా నియంత్రణ కోసం లాక్డవున్ మరికొన్ని రోజులు పొడిగిస్తేనే మంచిదని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సూచించారు.
వ్యాక్సిన్ కోసం శతవిధాలా ప్రయత్నాలు
ప్రాణాంతక వైరస్ ను నిరోధించడానికి నిబంధనలతో కూడిన లాక్డవున్ ఒక్కటే పరిష్కారమని బాధిత దేశాలలో కనిపిస్తున్న మెరుగైన ఫలితాలు ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నియంత్రణ కు ఉపకరించగల వాక్సిన్ తయారీ కి ప్రపంచ వ్యా ప్తంగా ముమ్మర ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
కొన్ని దేశాలు క్లినికల్ ట్రయల్స్ దశ ను దాటి వైరస్ బాధితులపై ప్రత్యక్ష వినియోగం కోసం ప్రయోగాత్మక సన్నాహాలు చేస్తున్నాయి.
వివిధ స్థాయిలలో నిర్వహిస్తున్న పరిశోధనలు ఏకోన్ముఖ లక్ష్యాన్ని అందుకోవడానికి సమయం పడుతుంది. ప్రపంచంలో 30 రకాల కోవిడ్-19 వైరస్ లు ఉన్నాయి. లాక్ డవున్ పొడిగింపు ఉన్నా లేక పోయినా వాక్సిన్ అందుబాటులో కి వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
నిర్లక్ష్యం చేస్తే మున్ముందు తీవ్ర పరిణామాలు చోటు చేసుకోగల ప్రమాదాన్ని ఊహించి వారు హెచ్చరిస్తున్నారు. అందుకు సాక్ష్యాలుగా ఇటీవల కొన్ని దేశాలలో అలక్ష్యం కారణంగా వైరస్ తిరిగి విజృంభించిన ఉదంతాలను ఉదహరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశంలోనూ వైరస్ పూర్తిగా అదృశ్యమయ్యే అవకాశం లేదని పలు అంతర్జాతీయ యూనివర్సిటీలకు చెందిన వైద్య, ఆరోగ్య శాస్త్రవేత్తల ప్రకటనలు గమనార్హం.
ఇటువంటి క్లిష్టమైన సమయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇప్పటికే 35 రోజుల నుంచి ప్రజలు అనుభవిస్తున్న స్వీయ నిర్బంధం, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండడం వంటివి మంచి ఫలితాలు ఇస్తున్నట్లు వైరస్ సంబంధిత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
కష్ట నష్టాలకు గురవుతున్న సామాన్యులు
వీటితో పాటు మరికొన్ని అంశాలను జోడించి ప్రజలకు సులభ గ్రాహ్యమయ్యేలా అనుభవజ్ఞులై న వైద్యులు, మానసిక నిపుణులు, వివిధ ఆరోగ్య ప్రచారకులు సలహా లు ఇస్తున్నారు. రోజుల తరబడి ఇళ్ళల్లో ఉండాల్సిన పరిస్థితులు అనూహ్యంగా రావడంతో సాధారణ ప్రజానీకం కష్టనష్టాలకు గురవుతున్న సమాచారం ప్రభుత్వాల పరిశీలనలో ఉంది. ఆర్థిక సమస్యలు పలు కోణాల్లో మానవజీవితాలను ప్రభావితం చేస్తాయి.
ప్రభుత్వం, పౌర సమాజాలు, స్వచ్చంద సంస్థలు అవసరమైన వారికి సహాయ సహకారాలు అందిస్తున్నా ….అక్కడక్కడ ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. రోజువారీ కూలీలు, అసంఘటిత కార్మికుల కచ్చితమైన వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండే అవకాశం లేదు. వలస కార్మికుల దుస్థితి మరీ దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అనుభవాలు భవితకు పాఠాలు. కరోనా ప్రభావం తో ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని, గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమ లు, వ్యవసాయాధారిత స్వయం ఉపాధి కల్పనలకు చేయూత నివ్వాలని ఆర్థిక, సామాజికవేత్తలు సూచిస్తున్నారు. గాంధీజీ కలలు కన్న ‘గ్రామస్వరాజ్యం’ సాకారమయ్యేలా పలు పథకాలు రచించాలని వారు కోరుతున్నారు.
గ్రామాలు వికసిస్తే పచ్చదనం, పరిశుభ్రత, కాలుష్యరహిత వాతావరణం, ఆర్థిక స్వావలంబన, స్వయంసమృద్ధి వంటి ఆశాజనక మార్పులు నిజమయ్యే అవకాశం ఉంది. లాక్డవున్ దశలవారీగా సడలించే సూచనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గుర్తించిన ప్రమాదకర జోన్ల్ ల ను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో లాక్డవున్ సరళ తరం చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్ధికంతో బాటు ఆరోగ్యం మరింత ముఖ్యం
ఆర్థికవ్యవస్థ కుప్పకూలిన నేపథ్యంలో ఆదాయాన్ని సమీకరించుకునేందుకు ఆయా రాష్ట్రప్రభుత్వాలకు స్వేచ్ఛ కల్పించింది. ఐతే ….ప్రధానమంత్రి పదే పదే చెబుతున్నట్లు ప్రజారోగ్యానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలూ , కేంద్రపాలిత ప్రాంతాలు స్థిర నిర్ణయంతో ఉన్నాయి. ప్రజల విశాల హితం కోరి ప్రభుత్వాలు పలు శ్రేయస్కర జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
కానీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్డవున్ నిబంధనల్ని ప్రజలు పాటించకపోవడంతో వైరస్ నియంత్రణకు తూట్లుపడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం కారణంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తే పరిస్థితులు ఇప్పటికంటే దారుణంగా ఉంటాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
1 comment
Thanks for the continuous updates on Corona, thanks alot sir.