వైకాపా నేత మోకా భాస్కర్రావు హత్యకేసులో అరెస్టయిన మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్రను పోలీసులు మెజిస్ట్రేట్ ముందుహాజరు పరిచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు విన్న రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు.
తెదేపా నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా నుంచి విశాఖపట్నం వెళ్తుండగా మార్గమధ్యంలో తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 29న హత్యానంతరం మోకా బంధువులు ఇచ్చిన ఫిర్యాదులో ఇతర నిందితులతోపాటు మాజీ మంత్రి కొల్లు పేరు ఉంది. పోలీసులు ఇప్పటివరకు అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు.