ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు కోర్టులలో జరిగే లోక్ ఆదాలత్ లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఇన్నాళ్లు కరోనా పుణ్యాన లోక్ ఆదాలత్ లు జరగలేదు. తాజాగా రాష్ట్రంలో తిరిగి లోక్ ఆదాలత్ లు ప్రారంభం అవబోతున్నాయి.
ఈ మేరకు విజయనగరం జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, ఎస్.కోట, చీపురుపల్లి, కొత్తవలస, గజపతినగరం, కురుపాం కోర్టులలో ఈ నెల 12వ తేదీన లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి తెలిపారు.
దీర్ఘకాలికంగా పరిష్కృతం కానీ వివిధ కేసుల పరిష్కారానికి ఇదొక చక్కని వేదికని పేర్కొన్నారు. ఇరు పార్టీల సమ్మతితో రాజీ చేయటం ద్వారా పలు కేసులు శాశ్వత పరిష్కారానికి వస్తాయని అన్నారు. భౌతిక విధానం, ఆన్లైన్ విధానం ద్వారా కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
సివిల్, క్రిమినల్, ఇన్సూరెన్స్, రోడ్ ప్రమాద, భూ సంబంధిత కేసులన్నీ పరిగణలోకి తీసుకొని ఆయా కోర్టుల్లో విచారిస్తారని వివరించారు.
కేసులు పరిష్కారం అనంతరం కక్షిదారులు మంచి ప్రవర్తనతో నడుచుకోవాలని, ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదించాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని కేసులను పరిష్కరించుకోవాలని తెలిపారు.