రాబోయే పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించి ప్రలోభాలను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ.ఎస్.యం.ఎస్. (ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్) మొబైల్ యాప్ ను మరింత ఆదునికరించినట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అన్నారు. మంగళవారం ఉదయం కేంద్ర ఎన్నికల కమిషన్ నుండి దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, నోడల్ అధికారులతో ఈ.ఎస్.యం.ఎస్ యాప్ ను ఉపయోగించటం పై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు.
ఎన్నికల కమిషన్ సాంకేతిక అధికారి సంతోష్ ఫతారియ మొబైల్ యాప్ పనితీరు, ఉపయోగించే విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా నోడల్ అధికారులకు వివరిస్తూ ఈ.ఎస్.యం.ఎస్ యాప్ ను తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రవేశ పెట్టడం జరిగిందని, అప్పుడు జిల్లా కమిటీ మాత్రమే లాగిన్ అయి సీజ్ చేసిన మొత్తాన్ని యాప్ లో నమోదు చేసేవారమన్నరు. ప్రస్తుతం ఈ యాప్ ను ఆధునీకరించి ఎఫ్.ఎస్.టి., సర్విలియన్ స్టాటిస్టికల్ టీం, ఇతర సీజర్ బృందాలు ఈ మొబైల్ యాప్ ను ఉపయోగించి ఎక్కడ తనిఖీ లు చేస్తారో అక్కడే పట్టుబడిన డబ్బు, లిక్కర్, ఇతర సామాగ్రి ని మొబైల్ యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. మొబైల్ యాప్ లో ఫీడ్ చేసిన అనంతరం ఇది జిల్లా, రాష్ట్ర ఎన్నికల అధికారి, కేంద్ర ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో ఉంటుందన్నారు. ఒకసారి సీజ్ చేసిన వివరాలు అదేరోజు రాత్రి 12 గంటల వరకు మాత్రమే మార్పు చేర్పులకు అవకాశం ఉంటుందని 12 తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోతుందనీ తెలిపారు. అంతకు ముందు పలుసార్లు రికార్డులు రాయడం, డబుల్ రికార్డులు కావడం వంటి సమస్యలు ఉండేవని ఇక ఈ యాప్ ద్వారా ఎలాంటి సమస్యకు చెక్ పెట్టినట్లు అయిందన్నారు.
ఈ మొబైల్ యాప్ పై త్వరలో నోడల్ అధికారులకు డెమో క్లాస్ ఇప్పించి సమర్థవంతంగా ఉపయోగించే విధంగా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందన్నారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, డి.ఎస్పీ ఆనంద్ రెడ్డి, జిల్లా అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్