ఓటర్ల తుది జాబితా నేడు ప్రకటించిన నేపథ్యంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సోమవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు. ఎన్నికలు జరిగేంత వరకూ ఓటర్ల నమోదు, తొలగింపు కార్యక్రమం జరుగుతూనే ఉంటుందని, అయితే ఎన్నికల తేదీకి పది రోజుల ముందుగా అందిన వివరాలను మాత్రమే పరిగణలోకి తీసుకొనేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఓటర్ల జాబితా సవరణపై ప్రతివారం జిల్లా ఎన్నికల అధికారి మరియు ఇ.ఆర్.ఓ. ల స్థాయిల్లో సమీక్షలు జరుగుతుంటాయని, ఓటర్ల జాబితాలో ఏమైన సందేహాలు, మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటే వెంటనే సంబందిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని అన్ని పార్టీల ప్రతినిధులకు ఆయన సూచించారు. అదే విధంగా ఓటర్లు నమోదు, తొలగింపుకు నిర్ణీత ఫార్ముల్లో ధరఖాస్తు చేసుకున్నట్లైతే, అధికారులు వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఓటర్ల తుది జాబితాపై ఎటు వంటి అభ్యంతరాల ఉన్నా వాటిని పరిష్కరించేందుకు తమ కార్యాలయంలో మంగళవారం నుండి ఒక ప్రత్యేక సెల్ పనిచేస్తుందని ఆయన తెలిపారు. అయితే రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓటర్ల జాబితాలపై ఎటు వంటి అభ్యంతరాలు ఉన్నా వెంటనే ఆన్ లైన్లో అభ్యంతరాలను నమోదు చేసుకున్న తదుపరి సంబందిత అభ్యంతరాలను పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో వైఎస్ఆర్సిపి ప్రతినిదులు లేళ్ల అప్పిరెడ్డి, లోకేష్, టిడిపి ప్రతినిధులు వర్ల రామయ్య, పి.అశోక్ బాబు, బి.జె.పి. ప్రతినిధి మట్టా ప్రసాద్, ఐ.ఎన్.సి. ప్రతినిధి వేముల శ్రీనివాసరావు, సిపిఐ (ఎం) ప్రతినిధులు జె.జయరామ్, కె.హరికిషోర్ తదితరులు పాల్గొన్నారు.