కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ప్రియురాలి ని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే నందికొట్కూరు లోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన విజయకుమార్, రుక్సాన మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం కర్నూలు నగరంలోని వుడ్ల్యాండ్ లాడ్జిలో గదిని వీరు అద్దెకు తీసుకున్నారు. కాగా శనివారం ఉదయం వరకు వీరు గది నుంచి బయటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బంది అనుమానంతో తలుపులు బద్దలు కొట్టారు. గదిలోని మంచంపై వారు ఇరువురు రక్తం మడుగులో పడి ఉండటంను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఉదయం లాడ్జికి వచ్చి పరిశీలించిన పోలీసులకు రుక్సానా కత్తిపోట్లతో రక్తపు మడుగులో పడి ఉండడం గుర్తించారు. విజయ్ కుమార్ ఆమె పక్కనే పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు గమనించారు. సంఘటన వద్ద పరిస్థితిని బట్టి ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. విజయ్ కుమార్ నగరంలోని ఓ ప్రవేట్ కంపెనీ లో అకౌంటెంట్ పనిచేస్తున్నట్లు సమాచారం. అక్రమ సంబంధమే ఈ ఘటన కు కారణంగా ప్రాథమికంగా తేల్చిన మూడవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీధర్ రెడ్డి వెల్లడించారు.