రాజమండ్రి మధురపూడి విమానాశ్రాయానికి మహర్దశ పట్టబోతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లకు కూడా లేని అధునాతన టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి రూ.347.15 కోట్లు శాంక్షన్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు.
ఈ మేరకు గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కృషి ఫలించిందని, ఏదైతే సాధించాలని గత కొద్ది సంవత్సరాలుగా కృషిచేశానో దానిని సాధించగలిగానని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన శాంక్షన్ ఆర్డర్ ఇప్పుడే అందుకున్నానని ఎంపీ భరత్ చెప్పారు. పెద్ద పెద్ద నగరాలలోని జాతీయ విమానాశ్రయాలకు కూడా ఇటువంటి డొమెస్టిక్ టర్మినల్ బిల్డింగ్ లేదని చెప్పారు. ఒకేసారి అయిదు పెద్ద విమానాలు ఆగితే ప్రయాణీకులు నేరుగా వెళ్ళేలా ఈ టర్మినల్ బిల్డింగ్ నిర్మాణం ఉంటుందని ఎంపీ భరత్ వివరించారు.
గత డిసెంబరు 16న జరిగిన బోర్డు మీటింగ్ లో తీర్మానం చేయగా నేడు కాంపిటేటివ్ అథారిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆమోదం, వ్యయం మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పారు. ఈ పనులను రాజమండ్రి ఎయిర్ పోర్ట్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహిస్తుందని ఆ ఉత్తర్వులో జాతీయ విమానాశ్రయ అధికారి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ శాంక్షన్ ఆర్డర్ ను సదరన్ రీజియన్ రీజనల్ డైరెక్టర్, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్-సీ), చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్-ఈ), జనరల్ మేనేజర్ (ఫైనాన్స్), రాజమండ్రి ఎయిర్పోర్ట్ డైరెక్టర్, రాజమండ్రి విమానాశ్రయం డీజీఎం (ఇంజనీరింగ్-సీ)కు అందాయని ఎంపీ భరత్ తెలిపారు.