సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. వివిధ వార్డులో సిసి రోడ్ల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ హుజూర్ నగర్ మున్సిపాలిటీని అన్ని హంగులతో అద్భుతంగా తీర్చిదిద్దుతానని అన్నారు.
ప్రతి ఒక్క వార్డుని అద్భుతంగా ఉండేలా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని, అందుకు తగినట్టుగా భారీగా నిధులు తీసుకువస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం పంట మార్పిడికి ప్రతి ఒక్క రైతు సహకరించి పంట మార్పిడి విధానాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని విధాల సీఎం కేసీఆర్ రైతుల గురించి ఆలోచించే పంట మార్పిడి విధానాన్ని తీసుకువచ్చారని ఆయన అన్నారు.
నిజంగా ప్రతిపక్ష నాయకులకు రైతులపై ప్రేమే ఉంటే గతంలో వారు పాలించిన సమయంలో ఎందుకు రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వలేకపోయారో తెలపాలన్నారు. ప్రస్తుతం కరోనా ప్రబలుతున్న సమయంలో కూడా రైతుల వద్ద నుండి పంటను కొనుగోలు చేసిన ప్రభుత్వం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంమే అని గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తున్న వారు ప్రస్తుతం వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉచిత కరెంటును, పంట కొనుగోలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, యువ నాయకులు కేటీఆర్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని భరోసా ఇచ్చారు.
దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉన్నదని, రానున్న కాలంలో కూడా సీఎం కేసీఆర్ నేతృత్వంలో అద్భుత పథకాలు ప్రవేశపెడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ గెల్లి అర్చనా రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.