ఉచిత వైద్య శిబిరాలు గ్రామీణ పేద ప్రజలకు వరం లాంటివని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో అజాదిక అమృత మహోత్సవ ఆరోగ్య మేళాను బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేడు వైద్యం భారీ ఖర్చుతో కూడుకున్న పని అని,పేదలకు వైద్యం అందని ద్రాక్షలా మారిన తరుణంలో కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యులు,గ్రామీణ ప్రాంతాలకు వచ్చి సేవలను అందించడం మంచిదని, ఆరోగ్య విషయంలో అందించిన సేవలు ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని అన్నారు. తాను హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రస్తుతం 100 పడకల ప్రభుత్వాసుపత్రిని మంజూరు చేసి నిర్మించానని చెప్పారు. రానున్న కొద్ది నెలల్లో పీహెచ్సీలు,సబ్ సెంటర్లకు అదనపు మౌలిక వసతులు మంజూరు చేయిస్తామన్నారు. సభా వేదిక వద్ద ఉన్న ఆశా వర్కర్లు,ఏఎన్ఎంలు,అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మెరుగైన జీతభత్యాలు,సర్వీస్ కండిషన్స్ డిమాండ్ను పార్లమెంట్లో నిరంతరం లేవనెత్తుతున్నట్లు తెలిపారు.
జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటా చలం మాట్లాడుతూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆధార్ కార్డ్ లింక్ చేయడం ద్వారా వారు ఏ వ్యాధితో బాధపడుతున్నది,వారు వాడిన మందుల వివరాలు జీవితకాలం ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఎం & హెచ్ ఓ డాక్టర్ నిరంజన్,జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, డాక్టర్ సాహితీ,డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ చంద్రశేఖర్,డాక్టర్ జయ,డాక్టర్ కిరణ్,డాక్టర్ శైలజ,ఫిరోజ్,ప్రేంసింగ్, ప్రమోద్,శ్రీనివాస్ వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్