తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా పోలీసుల విధులను అడ్డుకోవడం, హత్యాయత్నానికి పాల్పడటం, నిబంధనల ఉల్లంఘన తదితర నేరాలపై వివిధ సెక్షన్ల కింద 67 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇందులో 60 మందిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదైంది. చంద్రబాబు బుధవారం శాంతిపురం మండలంలో పర్యటించారు. ఆయన పర్యటన, అంతకుముందు చోటుచేసుకున్న ఘటనల్లో పోలీసు అధికారుల ఫిర్యాదుల మేరకు.. తెదేపా నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదుచేశారు.
గొల్లపల్లె క్రాసులో జరిగిన ఘటనల్లో పలమనేరు గ్రామీణ సీఐ అశోక్కుమార్ ఫిర్యాదు మేరకు.. తెదేపా మండల అధ్యక్షుడు విశ్వనాథనాయుడు, మహిళా విభాగం నేతలు చంద్రకళ, అనసూయ, సుగుణ… ఇంకా కేదార్నాథ్, ఆంజనేయరెడ్డి, నాగరాజు, ప్రవీణ్, రమేష్, జయపాల్తో పాటు మరో 50 మందిపై 147, 148, 332, 341, 353, 307 రెడ్విత్ (హత్యాయత్నం) సెక్షన్ల కింద రాళ్లబూదుగూరు పోలీసులు కేసు నమోదుచేశారు.
ఇవే ఘటనల్లో ఇంకా.. శ్యామల, సురేష్పై చిత్తూరు టౌన్ ఎస్సై ప్రసాద్ ఫిర్యాదు మేరకు 147, 148, 353, 503, రెడ్విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.పోలీసు విధులను అడ్డుకోవడంపై గంగవరం ఎస్సై సుధాకర్రెడ్డి ఫిర్యాదు మేరకు.. నాయనపల్లెకు చెందిన మంజునాథ్, గుండిశెట్టిపల్లెకు చెందిన అరుణ్కుమార్పై 341, 353, రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
నిబంధనలకు విరుద్ధంగా ప్రచార వాహనాలను వినియోగించిన నేరంపై రామకుప్పం మండలం ననియాలకు చెందిన రాజశేఖర్, పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరుకు చెందిన నానిబాబు, గుంటూరుకు చెందిన లార్ధరాజుపై 290, 188, 341 సెక్షన్ల కింద కేసు పెట్టారు.