ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదు ప్రార్ధనలకు వందల సంఖ్యలో ముస్లింలు వెళ్లారు. వారంతా వివిధ మార్గాలలో తమ తమ గ్రామాలకు, పట్టణాలకు చేరుకున్నారు.
ఇప్పుడు మర్కజ్ ప్రార్ధనలకు వెళ్లిన వారిలో ఆరుగురు తెలంగాణ వారు కరోనాతో మరణించగా జమ్మూ కాశ్మీర్ కు చెందిన ప్రధాన మత ప్రవక్త కూడా మరణించాడు. దాంతో మర్కజ్ వెళ్లిన వారి కోసం జల్లెడ పడుతున్నారు.
వందల సంఖ్యలో వారు ఉండటం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వారు పది మందితో కలిసి తిరగడం తదితర కారణాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు హై ఎలర్ట్ లోకి వెళ్లిపోయాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ నుంచి 280 మంది ఈ ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లినట్లు గుర్తించారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో మర్కజ్ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారి కారణంగా ఒక్క సారిగా కరోనా పాజిటీవ్ కేసులు 40కు పెరిగాయి. మరోవైపు ప్రార్థనల కోసం ఢిల్లీకి వెళ్ళొచ్చిన వారిలో ఏపీకి చెందినవారు 711 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 13 జిల్లాల నుంచి కూడా అక్కడికి వెళ్లినట్టు సమాచారం.
కొన్ని జిల్లాల్లో నమోదైన పాజిటివ్ కేసులకు మూలాలు మార్చి 13 నుంచి 17 వరకూ ఢిల్లీ వెళ్ళొచ్చిన వారేనని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. వీరిలో ఆస్పత్రి క్వారంటైన్ లో 122 మంది, ప్రభుత్వ క్వారంటైన్ లలో మరో 207 మంది ఉన్నారు. హోమ్ క్వారంటైన్ లో మరో 297 మంది ఉన్నారు.
ఇంకా ఆచూకీ తెలియని 85 మంది డేటాను పోలీసులు, వైద్యాధికారులు సేకరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి 186 మంది మర్కజ్ ప్రార్ధనలలో పాల్గొన్నారు. మెదక్ నుంచి 26 మంది, వరంగల్ నుంచి 25 మంది, నల్గొండ నుంచి 21 మంది, నిజామాబాద్ నుంచి 18 మంది ఉన్నారు.
ఇంకా కరీంనగర్ నుంచి 17 మంది, రంగారెడ్డి జిల్లా నుంచి 15 మంది, ఖమ్మం నుంచి 15 మంది, నిర్మల్ నుంచి 11 మంది, భైంసా నుంచి 11 మంది, ఆదిలాబాద్ నుంచి 10 మంది ఉన్నట్లు ప్రాధమిక అంచనాలు వేశారు. ఇతర దేశాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇండోనేసియా, థాయ్లాండ్, మలేసియా, కిరిగిస్థాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు ఈ ప్రేయర్స్ లో పాల్గొన్నారు.