తిరుమలలో ఇటీవల ప్రతిపాదించిన సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానాల ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు నిత్యాన్నదానం పేరుతో ఉచితంగా పెడుతున్న భోజనాల స్థానంలో సంప్రదాయ భోజనం పేరుతో డబ్బులు వసూలు చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.
తిరుమల తిరుపతి లో నిత్యాన్నదానం స్థానంలో డబ్బులు వసూలు చేయాలనే నిర్ణయంపై పలు విమర్శలు చెలరేగాయి. దాంతో ఈ ప్రతిపాదన విరమించుకుంటున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.
‘‘పాలక మండలి లేనప్పుడు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో భక్తులకు ప్రసాదంగా భోజనం అందించాలి. అన్నప్రసాదానికి భక్తుల నుంచి నగదు తీసుకోకూడదు. సంప్రదాయ భోజన విధానం తక్షణమే నిలిపివేస్తున్నాం. సర్వదర్శనం అమలుపై అధికారులతో చర్చిస్తాం. అధికారుల హామీ మేరకు వీలైనంత మందికి ఉచిత దర్శనం కల్పిస్తాం’’ అని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.