ప్రభుత్వ గిరిజన పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు జిల్లాలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో కెరియర్ గైడెన్స్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ పేర్కొన్నారు.
కలెక్టరేట్ ఆవరణలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ వెరిజన్ కంపెనీ నిర్మాణ్ సంస్థ రూపొందించిన మోబైల్ వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 వ తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్ధుల వరకు కెరీర్ గైడెన్స్పై ప్రత్యేక అవగాహన కల్పించేందుకు వాహనం గ్రామాలు, పాఠశాలలు, కళాశాలల్లో కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యాసంవత్సరం పూర్తయిన తరువాత ఎంచుకోవాల్సిన మార్గాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు నిర్మాణ సంస్థ ఉచితంగా సైకోమెటిక్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ టెస్ట్లో వారు ఎంచుకోవాల్సిన మార్గం సుగుమమవుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నారాయణ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ ఏటిడిఓ తిరుమలరావు, సీనియర్ కౌన్సిలర్స్ కె.కలింగ, యం.సాయిబాబా, సిహెచ్.ఉదయ్కిరణ్, తదితరులు పాల్గొన్నారు.