ప్రజాస్వామ్యంలో పవిత్రమైనది, ఎంతో విలువైనది ఓటుహక్కు అని, 18 సంవత్సరాలు వయస్సు పూర్తి అయిన యువతీ యువకులు అందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ అన్నారు. స్ఆర్&బిజీఎన్ఆర్ కళాశాలలో విద్యార్థులకు ఓటు హక్కుపై కలెక్టర్ అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం స్పెషల్ సమ్మరి రివిజన్ జరుగుతున్నట్లు, ఈ నెల 19 వరకు ఓటు హక్కును దరఖాస్తుకు అవకాశం ఉన్నట్లు ఆయన అన్నారు. ఇంకనూ ఓటరుగా నమోదు కాని వారుంటే, వెంటనే నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు.
ప్రతి ఒక్కరు తమ మొబైల్ లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఇదివరకు నమోదై, ఓటు హక్కు పొందిన వారు తమ ఓటు ఉందొ లేదో చెక్ చేసుకోవాలని, అదేవిధంగా తమ కుటుంబ సభ్యుల ఓటు ఉందొ లేదో చెక్ చేసుకోవాలని, ఒకవేళ లేకపోతే వెంటనే నమోదు చేసుకోవాలని అన్నారు.
వచ్చే 1 అక్టోబర్ నాటికి 18 సంవత్సరాలు నిండువారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఓటరుగా నమోదుకు పోర్టల్, మీ సేవ లేక ఫారం-6 ద్వారా దరఖాస్తు చేయాలని ఆయన అన్నారు. దరఖాస్తుఫారాలు కళాశాలల్లో అందుబాటులో ఉంచినట్లు, అధ్యాపకులు ఈ దిశగా తమ కళాశాలలో అర్హతగల ప్రతిఒక్కరూ ఓటుహక్కు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సిహెచ్. స్వామి, అధ్యాపకులు తదితరులు ఉన్నారు.