భక్తులు సమర్పించే బంగారం (బెల్లం) తిరిగి భక్తులకే ప్రసాదం గా ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు తెలంగాణా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణలో నిర్వహించే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర పై అధికారులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరిలో మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ అక్కడ జరుగుతున్న పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
జంపన్నవాగు ఇసుక లెవెల్ మెయింటైన్ చేయడానికి జరుగుతున్న పనులను పరిశీలించామని, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి పెట్టామని వివరించారు. పనులు పూర్తయిన తర్వాత లోపాలు కనిపిస్తే బాధ్యులపై చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. పోలీసులు సైతం ఇక్కడి ఏర్పాట్లను సమీక్షిస్తుండాలని, జాతరకు వచ్చే భక్తులను ఇబ్బందిపెట్టే విధంగా అటవీశాఖ అధికారులు వ్యవహరించరాదని తెలిపారు. అంతేగాకుండా, భక్తులకు బంగారం ఇచ్చే సంప్రదాయాన్ని ప్రారంభించాలని దేవాదాయ శాఖ తలపోస్తోందని వెల్లడించారు..